హిందూ కుటుంబాలను వేధిస్తూ.. మైనారిటీలకు ఉచిత విద్యుత్ ఇస్తారా?: రాంచందర్ రావు ఫైర్
- పాతబస్తీలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని రేవంత్ చెప్పారన్న రాంచందర్ రావు
- విద్యుత్ బిల్లులు చెల్లించని మైనార్టీలపై సానుభూతి ఎందుకని ప్రశ్న
- ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
పాతబస్తీలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఉచిత విద్యుత్ పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన... కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామనే రీతిలో సీఎం మాట్లాడటాన్ని రాంచందర్ రావు తప్పుబట్టారు. నిబంధనలు పాటించడం లేదని, నిబంధనల ఉల్లంఘన జరిగిందనే సాకుతో హైడ్రా ద్వారా పేద హిందూ కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు చూపించని సానుభూతిని, విద్యుత్ బిల్లులు చెల్లించని మైనారిటీల విషయంలో ఎందుకు చూపిస్తున్నారని నిలదీశారు.
ఒకవైపు సామాన్య పేద హిందూ కుటుంబాలపై హైడ్రాను ప్రయోగిస్తూ వేధింపులకు గురిచేస్తూ... మరోవైపు మైనారిటీల సంక్షేమం పేరుతో వారు బిల్లులు కట్టకపోవడాన్ని సమర్థిస్తూ ప్రోత్సహించేలా మాట్లాడటం కాంగ్రెస్ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి మైనారిటీలను ప్రసన్నం చేసుకునే బుజ్జగింపు రాజకీయం కాంగ్రెస్కు కొత్తేమీ కాదని, ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు వారి విధానంలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.