సింధు జలాలపై పాక్‌ మళ్లీ ప్రగల్భాలు.. ‘ప్రత్యక్షంగా బదులిస్తాం’ అంటూ కూతలు!

Shehbaz Sharif warns India of direct response as Pakistan boasts on Indus Waters Treaty
  • సింధు జలాలపై భారత్‌కు షెహ్‌బాజ్‌ మరోసారి హెచ్చరికలు
  • ప్రతి నీటి చుక్కా రెడ్‌లైన్‌ అని ప్రగల్భాలు
  • భారత్‌ వైఖరి మారకపోతే ప్రత్యక్ష బదులిస్తామంటూ కవ్వింపు
  • 2025 కంటే గట్టిగా స్పందిస్తామంటూ నోరు పారేసుకున్న వైనం
  • కశ్మీర్‌పై పాక్‌ పాత వైఖరినే కొనసాగిస్తుందని వ్యాఖ్య
ఇన్నాళ్లూ ఉగ్రవాదాన్ని పెంచిపోషించి ఇబ్బందులు తెచ్చుకున్న పాకిస్థాన్‌.. ఇప్పుడు నీటి విషయంలోనూ భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. సింధు జలాల ఒప్పందంపై పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. పాకిస్థాన్‌కు దక్కే నీటిలో ప్రతి చుక్కా తమకు ‘రెడ్‌లైన్‌’ అని హెచ్చరించారు. భారత్‌ తన వైఖరి మార్చుకోకపోతే ప్రత్యక్షంగా స్పందిస్తామని ప్రగల్భాలు పలికారు.

పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన ‘యాద్గార్‌-ఎ-ఫతా’ కార్యక్రమంలో షెహ్‌బాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2025లో భారత్‌తో జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో తమ సార్వభౌమత్వం, భద్రతకు సవాలు ఎదురైతే గతం కంటే గట్టిగా బదులిస్తామని చెప్పుకొచ్చారు.

2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అనంతరం ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. ఈ చర్యలను పాక్‌ ప్రధాని తాజాగా తప్పుబట్టారు. భారత్‌ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఒప్పందాన్ని నిలిపివేసిందని ఆరోపించారు.

ఒకవైపు శాంతి కావాలంటూనే మరోవైపు భారత్‌పై బెదిరింపు ధోరణిని షెహ్‌బాజ్‌ ప్రదర్శించారు. తమ సార్వభౌమత్వాన్ని ఎవరైనా సవాలు చేస్తే బలంగా స్పందిస్తామని అన్నారు. కశ్మీర్‌పై పాకిస్థాన్‌ పాత వైఖరినే కొనసాగిస్తుందని చెప్పారు. కశ్మీరీలకు రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు ఇస్తామని ప్రకటించారు.

సౌదీ అరేబియా, టర్కీతో ఇటీవల కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందాన్ని కూడా షెహ్‌బాజ్‌ ప్రస్తావించారు. మూడు దేశాల్లో ఏదో ఒకదానిపై సాయుధ దాడి జరిగితే.. మూడింటిపై దాడిగానే పరిగణించేలా ఒప్పందం ఉందని తెలిపారు.
Advertisement
Shehbaz Sharif
Indus Waters Treaty
India Pakistan water dispute
Operation Sindoor
Saudi Arabia Turkey defense pact
Pahalgham terror attack

More Telugu News