ఇవాళ జైలులో నన్ను కూడా అవమానించారు: జగన్

Jagan says he was insulted in jail today
  • కర్నూలు జైలులో ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్
  • చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో ప్రతిపక్షాన్ని అణిచివేస్తున్నారని ఆరోపణ
  • బాధితులే నిందితులుగా మారుతున్నారని, విరూపాక్షి ఘటనే ఉదాహరణ అన్న జగన్ 
  • బీసీ, మైనారిటీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని విమర్శ
  • తాను నాటిన తప్పుడు విత్తనాలే రేపు చంద్రబాబును చుట్టుకుంటాయని హెచ్చరిక
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఘటనే నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని గురువారం ఆయన ములాఖత్‌లో భాగంగా కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాను ఇవాళ జైలుకు వస్తే తనను కూడా అవమానించే ప్రయత్నం చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక మాజీ ముఖ్యమంత్రిగా వచ్చిన నన్ను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయకుండా, గ్రిల్స్ బయట నిలబెట్టి ఫోటో తీశారు. ఇది చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనం. మా హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే, వీళ్లు అవమానించే సంస్కృతిని తెచ్చారు" అని అన్నారు.

ప్రభుత్వాలు శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. "ఈరోజు మీరు ఏ తప్పుడు విత్తనాలు నాటుతున్నారో, అవే రేపు మహావృక్షాలై మిమ్మల్ని రెండింతలుగా చుట్టుకుంటాయి. ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు" అని జగన్ హెచ్చరించారు. సమయం వేగంగా గడిచిపోతుందని, ఈ దుర్మార్గపు పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని ఆయన వ్యాఖ్యానించారు.

"ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో బాధితులే నిందితులుగా మారుతున్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. దీనికి విరూపాక్షి ఉదంతమే ప్రబల ఉదాహరణ" అని జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 1న చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో తమ పార్టీ కార్యకర్త గిరి తనపై దాడి జరుగుతోందని, రక్షించమని రాత్రి 7:45 గంటలకు ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేసి, వీడియోలు పంపాడని జగన్ ఆధారాలను చూపుతూ వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్థానిక ఎస్సైకి 7:47 గంటలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదన్నారు. పైగా, కార్యకర్తను కాపాడటానికి వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేశారని, ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టారని ఆరోపించారు.

దాడికి గురైన విరూపాక్షి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా, అర్ధరాత్రి 2:45 గంటలకు వందల మంది పోలీసులు దొంగల్లా ఆయన ఇంటిపై పడి, తలుపులు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అరెస్టు చేశారని జగన్ మండిపడ్డారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 38 మందిపై మూడు వేర్వేరు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని తెలిపారు. ఒకే వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్‌లో రెండుసార్లు చేర్చడం చూస్తే, కేసు ఎంత కట్టుకథో అర్థమవుతోందన్నారు.

ఈ ప్రభుత్వం బీసీ, మైనారిటీ వర్గాల నాయకత్వాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి బైక్ యాక్సిడెంట్‌ను హత్యాయత్నంగా చిత్రీకరించడం, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కిడ్నాప్ కేసు పెట్టడం, కారుమూరు సునీల్‌పై అక్రమ కేసులు బనాయించడం వంటివి ఇందులో భాగమేనని విమర్శించారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Alur MLA Virupakshi arrest
Chandrababu Naidu Red Book
Kurnool District Jail
YSRCP leaders illegal arrests
Andhra Pradesh political news

More Telugu News