శ్రీనగర్ లో భారీగా హిమపాతం.. జోడో యాత్ర సభకు ఆటంకం!
- శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత
- జోడో యాత్ర ముగింపు సభ కోసం శ్రీనగర్ లోని స్టేడియంలో ఏర్పాట్లు
- విమానాల రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్ లతో సభకు వచ్చే నేతలకు ఇబ్బందులు
- ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నేతలు
జోడో యాత్ర ముగింపు సభ సజావుగా సాగేదెలాగని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీనగర్ లోని షేర్ ఈ కశ్మీర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాహుల్ జెండా ఎగరవేసి, అక్కడి నుంచి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. అయితే, మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ర్యాలీ నిర్వహించడం సాధ్యం కాదేమోనని పార్టీ నేతలు సందేహిస్తున్నారు.
మరోవైపు, జోడో యాత్ర ముగింపు సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన 12 పార్టీల నేతలు హాజరుకానున్నారు. అయితే, జాతీయ రహదారి మూసేయడం, రోడ్లపై పేరుకుపోయిన మంచు కారణంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సభకు వచ్చే నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. కొంతమంది ప్రయాణాలు మానుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెప్పారు.