150 ఏళ్లలో ఎన్నడూ లేని కరవు నెలకొంది: తుమ్మల నాగేశ్వరరావు
- పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయన్న తుమ్మల
- దీని కారణంగా రుతుపవనాల జాడ లేకుండా పోయిందని వెల్లడి
- వచ్చే నెలలో కురిసే వర్షాలు మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడతాయన్న మంత్రి
ప్రపంచంపై ప్రకృతి తీవ్రంగా దాడి చేస్తోందని తెలంగాణ వ్యవసాయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గత 150 సంవత్సరాలలో ఎన్నడూ చూడని తీవ్ర కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం వల్ల దేశానికి రావాల్సిన నైరుతి రుతుపవనాల జాడ లేకుండా పోయిందని, దాంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దీని ప్రభావం వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల వరకు ఉండే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో సరైన వర్షాలు కురవవని ఐఎండీ మరియు అంతర్జాతీయ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.
వచ్చే నెలలో కురిసే స్వల్ప వర్షాలు కేవలం మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయడం చాలా కష్టతరమని స్పష్టం చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు తక్కువ సమయంలో, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల పనితీరును పరిశీలించేందుకు 6 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, ఇవి వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.