Perni Nani: చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, లోకేశ్ 1000 అబద్ధాలు చెబుతున్నాడు: పేర్ని నాని ఫైర్

  • కుప్పంలో నారా లోకేశ్ యువగళం సభ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
  • జగన్ ను మిల్లీమీటర్ కూడా కదల్చలేరన్న పేర్ని నాని
  • కుప్పంలో టీడీపీ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్య  
Perni Nani reacts on Lokesh Kuppam rally

కుప్పంలో నారా లోకేశ్ యువగళం సభలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. టీడీపీ అధినాయకత్వం చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. కుప్పం సభలో టీడీపీ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలేనని, చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, లోకేశ్ 1000 అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి రూ.22 వేల కోట్ల విద్యుత్ బకాయిలు పెడితే, ఆ భారం ప్రజలే మోస్తున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు 40 లక్షల పెన్షన్లు ఇస్తే, జగన్ ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు. కొత్త మద్యం బ్రాండులు వచ్చింది చంద్రబాబు పాలనలోనే అని పేర్ని నాని స్పష్టం చేశారు.

ఇక, చంద్రబాబు చెత్తనాయకుడు అని అచ్చెన్నాయుడే అంటున్నారని వెల్లడించారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఒక స్పాన్సర్డ్ కార్యక్రమం అని విమర్శించారు. చంద్రబాబు మంచి పనులు చేసుంటే లోకేశ్ ఇవాళ ఎందుకు బజారునపడ్డారని ప్రశ్నించారు. మరోవైపు, నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

మరో మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, టీడీపీలో వారసత్వం కోసమే లోకేశ్ పాదయాత్ర అని విమర్శించారు. ఎన్టీఆర్ రక్తంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీని ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకే పాదయాత్ర అని వ్యాఖ్యానించారు. అసలు, లోకేశ్ ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నాడని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఏమాత్రం ఉపయోగంలేదని తెలిపారు.

More Telugu News