Kesineni Nani: మైలవరంలో బొమ్మసానికే నా మద్దతు: కేశినేని నాని

  • బొమ్మసాని పెద్ద పెదవుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్న నాని 
  • రాజుల్లా భావించేవాళ్లు మనకొద్దని వ్యాఖ్యలు
  • బొమ్మసాని కుటుంబం ఏడు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని వెల్లడి 
Kesineni Nani says he will support for Bommasani

తన తమ్ముడికి టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోనన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇవాళ అంతకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో తన మద్దతు బొమ్మసాని సుబ్బారావుకే అని స్పష్టం చేశారు. తద్వారా దేవినేని ఉమకు టికెట్ ఇస్తే తన సహకారం ఉండదని పరోక్షంగా తేల్చేశారు. బొమ్మసాని మరిన్ని పెద్ద పదవుల్లోకి వెళ్లాలని కేశినేని నాని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు రాజభోగాలు అనుభవిస్తున్నారని తెలిపారు. తమను తాము రాజుల్లా భావించేవాళ్లు, పదవుల కోసం పాకులాడేవాళ్లు మనకు వద్దని, బొమ్మసాని వంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. బొమ్మసాని కుటుంబం గత ఏడు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని పేర్కొన్నారు. 

కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఇవాళ దేవినేని ఉమతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, నాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

విజయవాడ సెంట్రల్ నియోజకర్గంలో డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కేశినేని నాని పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తిని, ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేశినేని నాని పిలుపునిచ్చారు.

More Telugu News