Perni Nani: ఇన్ని వేలమందిని తరలించడం ఉయ్యూరు ట్రస్టుకు సాధ్యమయ్యే పనేనా?: పేర్ని నాని

Perni Nani press meet over Uyyuru Foundation program
  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట
  • ముగ్గురు మహిళల మృతి
  • చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడన్న పేర్ని నాని
  • ఉయ్యూరు ట్రస్టు కార్యక్రమం అనేది ఒక డ్రామా అని వెల్లడి
గుంటూరులో జరిగిన చంద్రన్న కానుకల పంపిణీలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడంలేదా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు సభలకు జనం రావడంలేదని, జనాన్ని తరలించారని ఆరోపించారు. గుంటూరు సభకు ఇన్నివేలమందిని తరలించడం ఉయ్యూరు ట్రస్టుకు సాధ్యమయ్యే పనేనా...? అని నిలదీశారు. ఉయ్యూరు ట్రస్టు కార్యక్రమం అనేది ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నారని అన్నారు. 10 వేల మందికి ఆహ్వానం అని ప్రకటనలో పేర్కొని, 30 వేల మందికి టోకెన్లు ఇచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని పేర్ని నాని మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే టీడీపీ నేతలు ప్లేటు ఫిరాయించారని విమర్శించారు. 

ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, పోలీసులు తమ పని తాము చేస్తారని స్పష్టం చేశారు. "ప్రతి వారం ఆదివారం నాడు సెలవు దొరకగానే ఒక అడ్డగాడిద వచ్చి జగన్ గారిని తిట్టి వెళ్లిపోతుంది. ఇప్పటంలో కూడా ఎల్లో మీడియా, ఆ ఆదివారం అతను రచ్చ చేశారు. ఒక ప్రహరీ గోడ కూల్చివేస్తే ప్రశ్నించినవారు ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు" అని విమర్శించారు.
Perni Nani
Uyyuru Foundation
Chandrababu
TDP

More Telugu News