చంద్రబాబుతో కృష్ణా జిల్లా టీడీపీ నేతల భేటీకి ముగ్గురు కీలక నేతల గైర్హాజరు... కారణం ఇదే!
- చెన్నుపాటి గాంధీపై దాడి నేపథ్యంలో జరిగిన భేటీ
- ఢిల్లీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయిన కేశినేని
- విదేశీ పర్యటనలతో గైర్హాజరైన దేవినేని ఉమ, బొండా ఉమ
- నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఈ కీలక భేటీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు గైర్హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న కారణంగా కేశినేని నాని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా దేవినేని ఉమ, బొండా ఉమలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.
భేటీలో భాగంగా కృష్ణా జిల్లా నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కీలక నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే ఆయన సొంత జిల్లాకు చెందిన నేతలే స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి ఉందన్న చంద్రబాబు... పరిస్థితిలో మార్పు రాకపోతే సహించేది లేదని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో నేతలంతా ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.