స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఢిల్లీ హైకోర్టు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
- ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు
- రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా భారీ భద్రత
దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముంగిట తీవ్ర కలకలం రేగింది. వేడుకలకు ఒక్క రోజు ముందే ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు రావడం భద్రతా దళాలను తీవ్ర అప్రమత్తం చేసింది.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో పాటు విమానాశ్రయ అధికారులకు వచ్చిన ఈ బెదిరింపు లేఖలతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు వెంటనే రంగంలోకి దిగాయి. హైకోర్టు ఆవరణ, విమానాశ్రయ ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ సోదాలు చేపట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే రాజధాని వ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయగా, ఈ బెదిరింపులతో సున్నితమైన ప్రభుత్వ భవనాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తనిఖీలను తీవ్రతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.