భారత్‌ పక్కన కొత్త ఉగ్రముఠాలు.. బంగ్లాదేశ్‌లో అల్‌ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక!

UN warns of Al-Qaeda bases in Bangladesh as new terror groups emerge near India
  • బంగ్లాదేశ్‌ను అల్‌ఖైదా అడ్డాగా మార్చుకోవాలని చూస్తోందని ఐరాస హెచ్చరిక
  • ఉగ్ర సెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఏక్యూఐఎస్‌ యత్నాలు
  • దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారిందని వెల్లడి
  • బంగ్లాదేశ్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌లపై ఐరాస ఆందోళన
  • పాక్‌-ఆఫ్ఘన్‌ ఉద్రిక్తతలు ఉగ్ర ముప్పును పెంచుతున్నాయని వెల్లడి
బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) అక్కడ ఉగ్రవాద సెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొంది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించిన 38వ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఐసిస్‌, అల్‌ఖైదా తదితర ఉగ్ర సంస్థలపై పనిచేసే విశ్లేషణ, ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది.

నివేదిక ప్రకారం.. ఏక్యూఐఎస్‌ గతంలో మాదిరిగా పెద్ద ఉగ్ర బృందాలపై ఆధారపడటం లేదు. చిన్నచిన్న, చెదురుమదురు సెల్స్‌తో పనిచేస్తోంది. లాజిస్టిక్స్‌, ఆర్థిక నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ విధానంతో ప్రాంతీయంగా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

2025 నవంబరులో ఢిల్లీలో జరిగిన ఎర్రకోట దాడికి ఏక్యూఐఎస్‌తో సంబంధం ఉన్నట్లు నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను ఉగ్ర నెట్‌వర్క్‌ నిర్మాణానికి స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాల తర్వాత ఉగ్ర సంస్థలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు పెరగడానికి పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా కారణమవుతున్నాయని నివేదిక తెలిపింది. తాలిబన్‌ పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో పలు ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు సాగించడం పొరుగు దేశాలకు దీర్ఘకాలిక ముప్పుగా మారిందని హెచ్చరించింది.
Advertisement
Al-Qaeda
Bangladesh
United Nations
AQIS
South Asia Terrorism
Terrorist Cells

More Telugu News