America: అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరట.. ఆగస్టులో రెట్టింపు విమాన సర్వీసులు

  • ప్రస్తుతం 11గా ఉన్న సర్వీసులు
  • ఆగస్టు ఏడు  నుంచి 22కు పెంపు
  • 6, 13, 20, 27 తేదీల్లో ముంబై-నెవార్క్ మధ్య అదనపు సర్వీసులు
Air India to double flight services to america

అమెరికా వెళ్లే విద్యార్థులకు ఇది శుభవార్తే. వచ్చే నెల నుంచి అమెరికాకు రెట్టింపు సంఖ్యలో విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. దేశంలో రెండో దశ కరోనా విజృంభణ కారణంగా భారత్ నుంచి విమానాల రాకపోకలను అమెరికా నియంత్రించింది. దీంతో ఎయిర్ ఇండియా పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. రద్దయిన విమానాల్లో ముంబై-నెవార్క్ విమానం కూడా ఉంది. నిజానికి, భారత విమానాలపై అమెరికా ఆంక్షలు విధించకముందు ఎయిర్ ఇండియా 40 వరకు విమాన సర్వీసులు నడిపేది. జులై నాటికి అవి 11కు పడిపోయాయి.

అమెరికాలో పలు యూనివర్సిటీలు ఆగస్టు నుంచి తెరుచుకోనుండడంతో హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెళ్లే వేలాదిమంది విద్యార్థులు విమానాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటనపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అమెరికాకు ప్రస్తుతం 11 సర్వీసులు నడుస్తుండగా ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే, ముంబై-నెవార్క్ మధ్య ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో అదనపు సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.

More Telugu News