Chandrababu: రమణ దీక్షితులు గారి వ్యాఖ్యలు గర్హనీయం.. కానీ, మీరు చేసిందేంటీ?: ఐవైఆర్ కృష్ణారావు

  • చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు
  • దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు
  • అర్చకులను రోడ్డుపై పడేశారు
  • ఈనాటి పరిస్థితికి ప్రధాన బాధ్యత తమరు, తమ పార్టీదే
iyr slams chandra babu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ను క‌లిసిన‌ టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆయ‌న‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించిన విష‌యం తెలిసిందే. అయితే, మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని, మ‌నిషి ఎప్పుడూ దేవుడు కాలేడ‌ని, మ‌నిషి మ‌నిషేన‌ని, దేవుడు దేవుడేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని తెలిపారు.

దీనిపై ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. 'నిజమే. రమణ దీక్షితులు గారి వ్యాఖ్యలు గర్హనీయం, ఖండించి దగినవి. కానీ, దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించి, అర్చకులను రోడ్డుపై పడేసిన తమరికి, తమ పార్టీకి మాత్రం ఈ విషయంలో విమర్శించే నైతిక హక్కు లేదు. మిగిలిన అందరికీ ఉంది. ఈనాటి పరిస్థితికి ప్రధాన బాధ్యత తమరు, తమ పార్టీయే. మరిచిపోరాదు' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

More Telugu News