Sanchaita: ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది: స‌ంచ‌యిత గ‌జ‌ప‌తి

  • ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించారు
  • ఆయన మరణానికి కారకుల‌య్యారు
  • వారిలో చంద్ర‌బాబు గారితో పాటు అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారు ఒకరు
  • వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ రాసిన లేఖ ఇది
sanchaita slams ashok gajapati

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా  ట్విట్ట‌ర్  వేదికగా టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఓ ట్వీట్ చేశారు. 'తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని, మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. అయితే, ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన  మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

'పార్టీ పెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్ర‌బాబు గారితో పాటు అశోక్ గ‌జ‌ప‌తి రాజు  గారు ఒకరు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్‌ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది' అని సంచ‌యిత పేర్కొన్నారు.

'రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారు ఎన్టీఆర్‌ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్ధంతి రోజున కొనియాడడం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది' అంటూ సంచ‌యిత వ్యంగ్యంగా కామెంట్ చేశారు.  

More Telugu News