Puri Jagannadh: రాఘవేంద్రరావుకు నలుగురి ముందూ క్షమాపణలు చెప్పిన పూరీ జగన్నాథ్!

  • సినీ పరిశ్రమకు అనుష్క వచ్చి 15 ఏళ్లు
  • ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న పూరీ, దర్శకేంద్రుడు
  • నాడు కొంత వాగుడు వాగానని గుర్తు చేసుకున్న పూరీ
  • నలుగురి ముందూ సారీ చెబుతున్నానని వెల్లడి
Puri Jagannath Says Sorry to Raghavendra Rao

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు, బహిరంగ వేదికపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్షమాపణలు చెప్పారు. తాను ఎందుకు క్షమాపణలు చెబుతున్నానన్న విషయమై ఆయన వివరణ కూడా ఇచ్చారు. టాప్ హీరోయిన్ అనుష్క నటిస్టున్న 'నిశ్శబ్దం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అనుష్క సినీ పరిశ్రమకు పరిచయమై 15 ఏళ్లు గడిచిన సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దీనికి అనుష్కను వెండి తెరకు పరిచయం చేసిన పూరీతో పాటు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.

ఇక గతంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్న పూరీ, తన తొలి సినిమా పూజా కార్యక్రమానికి రాఘవేంద్రరావు వచ్చి క్లాప్‌ కొట్టి, ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన పేరు అడిగితే చెప్పానని, గడ్డాన్ని చూసి తమిళోడివని అనుకున్నానని రాఘవేంద్రరావు చెప్పారని అన్నారు. ఆ సమయంలో తాను నోరు జారి, "సార్‌... మీకూ గడ్డం ఉంది. మేము అనుకోవడం లేదు కదా?" అని ప్రశ్నించగా, నీకు వెటకారం ఎక్కువేనంటూ ఆయన సరదాగా తిట్టారని అన్నారు.

ఆ తరువాత 'సూపర్‌' షూటింగ్ సమయంలో ఆయన సెట్స్ కు వచ్చారని, తాను వచ్చిన పనేంటని అడిగితే, నాగార్జున డేట్స్ కోసం వచ్చానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా నోరుజారుతూ, తాను ఐదో తరగతిలో ఉన్నప్పుడు 'అడవి రాముడు' సినిమా చూశానని చెబుతూ, తానే డైరెక్టర్ ను అయి, సినిమాలు తీస్తుంటే, మీరు రిటైర్ కావచ్చు కదా? అని సలహా ఇచ్చానని, ఆప్పుడు ఆయన ఓ చిరునవ్వు నవ్వి, తన భుజం తట్టి, నాగార్జునను కలిసి డేట్స్ తీసుకుని వెళ్లిపోయారని అన్నారు.

తాను దర్శకత్వం వహించిన సినిమా ఫ్లాప్ కాగా, ఆయన తీసిన 'అన్నమయ్య' మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, అప్పుడు తాను వాగిన వాగుడుకు, ఇప్పుడు అందరి ముందూ క్షమాపణలు చెబుతున్నానని పూరీ జగన్నాథ్ వ్యాఖ్యానించారు.

More Telugu News