భారతీయులకు మధుమేహం ఎందుకు ముందే వస్తోంది?.. నిపుణులు చెప్పిన అసలు కారణాలు!

Why Indians are getting diabetes early real reasons explained by experts
  • భారతీయుల్లో 20-30 ఏళ్లకే టైప్-2 మధుమేహం
  • భారతీయుల ప్రత్యేక శరీర నిర్మాణమే కారణమంటున్న అధ్యయనాలు
  • సన్నగా ఉన్నా ప్రమాదాన్ని పెంచుతున్న పొట్ట కొవ్వు
  • జంక్‌ ఫుడ్‌, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలు
  • ప్రీ-డయాబెటిస్‌ను ముందుగానే గుర్తిస్తే నివారించొచ్చంటున్న నిపుణులు
ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే టైప్-2 మధుమేహం ఇప్పుడు 20-30 ఏళ్ల వయసులోనే భారతీయులను పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రతి ఏడుగురిలో ఒకరికి డయాబెటిస్‌, ప్రతి నలుగురిలో ఒకరికి ప్రీ-డయాబెటిస్‌ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. చాలామందికి గుండె, కిడ్నీ, కళ్లపై ప్రభావం పడే వరకు ఈ వ్యాధి ఉన్న విషయం కూడా తెలియడం లేదని హెచ్చరిస్తున్నారు.

భారతీయుల ప్రత్యేక శరీర నిర్మాణమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. బయటకు సన్నగా కనిపించినా పొట్ట, కాలేయం చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, కండరాలు తక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్‌ నిరోధకత వేగంగా పెరుగుతుంది. అందుకే బరువు ఎక్కువగా లేకపోయినా భారతీయుల్లో తక్కువ వయసులోనే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.

పట్టణ జీవనం, వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్‌, గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి జీవనశైలి మార్పులు పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి. ముఖ్యంగా 31-50 ఏళ్ల ఉద్యోగుల్లో మధుమేహం, ప్రీ-డయాబెటిస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తాజా కార్పొరేట్‌ ఆరోగ్య పరీక్షలు వెల్లడించాయి. 20 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగుల్లో కూడా ఈ సమస్య పెరుగుతున్నట్లు గుర్తించారు.

అయితే ప్రీ-డయాబెటిస్‌ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని నివారించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కండరాల బలం పెంచే వ్యాయామాలు, సమతుల ఆహారం, తగినంత నిద్ర, బరువు నియంత్రణ, కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.
Advertisement
Indians
Diabetes
Type 2 Diabetes
Insulin resistance
Pre-diabetes
Lifestyle diseases

More Telugu News