ఆధార్‌ నుంచి లోన్‌ వివరాల వరకు.. ప్రముఖ బ్యాంక్‌ నుంచి డేటా చోరీ!

From Aadhaar to loan details data theft from a leading bank
  • బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్‌ ఆరోపణలు
  • 1 టెరాబైట్‌ సమాచారం డార్క్‌వెబ్‌లో ఉన్నట్లు హ్యాకర్‌ వెల్లడి
  • ఆధార్‌, లోన్‌, నెట్‌బ్యాంకింగ్‌ వివరాలు ఉన్నట్లు ప్రచారం
  • ట్రిపుల్‌ఎక్స్‌ హ్యాకింగ్‌ గ్రూప్‌పై అనుమానాలు
  • బ్యాంక్‌, ఆర్బీఐ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బ్యాంక్‌ వ్యవస్థలోకి చొరబడ్డామని ప్రకటించిన ఓ హ్యాకర్‌ దాదాపు 1 టెరాబైట్‌ కీలక డేటాను డార్క్‌వెబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నాడు. ఇందులో ఖాతాదారుల ఆధార్‌ నంబర్లు, పేర్లు, రుణాల వివరాలు, సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాల సమాచారం, నెట్‌బ్యాంకింగ్‌, ఎన్‌ఆర్‌ఐ, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయని చెబుతున్నాడు.

ఈ డేటా లీక్‌కు సంబంధించిన కొన్ని నమూనా పత్రాలను కూడా హ్యాకర్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వీటిని పరిశీలించిన సైబర్ భద్రత నిపుణుడు, క్యాష్‌లెస్ కన్జ్యూమర్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ లక్ష్మణన్‌.. ఇవి బ్యాంక్‌కు చెందిన అంతర్గత పత్రాలుగానే కనిపిస్తున్నాయని తెలిపారు. బ్రాంచ్‌ ఆడిట్‌ నివేదికలు, లోన్‌ డాక్యుమెంట్లు, అంతర్గత కమ్యూనికేషన్‌, విజిలెన్స్‌ దర్యాప్తు వివరాలు, ఖాతాదారుల దరఖాస్తుల వంటి పత్రాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. దీన్ని ఆయన ‘సైబర్ విపత్తు’ అభివర్ణించారు.

ఈ దాడి వెనుక ‘ట్రిపుల్‌ఎక్స్‌’ అనే హ్యాకింగ్‌ గ్రూప్‌ ఉండొచ్చని శ్రీకాంత్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇదే గ్రూప్‌ ఈ ఏడాది ఇండోనేషియాలోని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ‘పీటీ బ్యాంక్‌ నెగారా ఇండోనేషియా’ నుంచి సుమారు 2 టెరాబైట్ల డేటాను చోరీ చేసినట్లు సమాచారం. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఐ ఇప్పటివరకు ఈ డేటా లీక్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
Bank of Baroda
Bank of Baroda data leak
Cyber attack on Indian banks
Dark web data breach
TripleX hacking group
Aadhaar data theft

More Telugu News