విజయవాడ మేయర్ స్థానం ముస్లింలకే ఇవ్వాలి: పార్టీ అధిష్ఠానాన్ని కోరిన జలీల్ ఖాన్
- దశాబ్దాలుగా టీడీపీ విజయం కోసం ముస్లింలు పని చేస్తున్నారన్న జలీల్ ఖాన్
- మేయర్ టికెట్ ముస్లింలకు కేటాయిస్తే గెలుపు మరింత సులువవుతుందని వ్యాఖ్య
- టికెట్ మహిళలకు కేటాయిస్తే తన కూతురుకు అవకాశం కల్పించాలని విన్నపం
విజయవాడ నగర పాలక సంస్థ (VMC) రాబోయే ఎన్నికల్లో మేయర్ పీఠం కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విజయవాడ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ అభ్యర్థికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి, విజయానికి కట్టుబడి ఉన్న ముస్లిం వర్గానికి తగిన రాజకీయాధికారం ఇవ్వడం ద్వారా వారి సేవలను గుర్తించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
ముస్లిం జనాభా ప్రాతిపదికన మేయర్ స్థానాన్ని మైనారిటీలకు కేటాయిస్తే నగరంలో పార్టీ గెలుపు మరింత సులువవుతుందని జలీల్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో మైనారిటీ వర్గంలో ఎలాంటి విభేదాలు కానీ, అంతర్గత పోటీ కానీ ఉండదని, అభ్యర్థి ఎవరైనా సరే ఐక్యంగా పనిచేసి పార్టీని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా మేయర్ స్థానం గనుక మహిళలకు కేటాయించాల్సి వస్తే, తన కుమార్తె (షబానా ఖాన్)కు ఆ అవకాశం కల్పించాలని ఆయన బహిరంగంగా అధిష్ఠానాన్ని కోరారు. తన కుమార్తెకు అవకాశం ఇస్తే విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి సమర్థవంతంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.