ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో గూండాగిరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- 10 నుంచి 20 వాహనాల కాన్వాయ్లు క్యాంపస్లోకి ఎలా వచ్చాయని ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- ఒక వ్యక్తి తుపాకీ పట్టుకున్న పరిశీలించి తీవ్ర అసహనం
- ఇలాంటి వారిని విద్యార్థులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్న
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, నిబంధనల ఉల్లంఘనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపస్లో విద్యార్థి సంఘాల అక్రమాలు, గూండాగిరి తీరుపై మండిపడుతూ 'మీ పద్ధతి ఇంకా మార్చుకోలేదు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించడమే కాకుండా, ఫలితాల అనంతరం క్యాంపస్ పరిధిలోనూ, హాస్టళ్లలోనూ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని నిషేధం విధించింది.
విచారణ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేని 10 నుంచి 20 వాహనాల కాన్వాయ్లు క్యాంపస్లోకి ఎలా వచ్చాయని, వాహనాల పైకప్పులపై నిలబడి ప్రచారం చేయడంపై న్యాయస్థానం అధికారులను నిలదీసింది. అభ్యర్థులలో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్న కాన్వాయ్ ఫొటోలను, అలాగే ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని ఉన్న దృశ్యాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అలాంటి వారిని అసలైన విద్యార్థులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై బాధ్యులైన విద్యార్థి సంఘాలు, అభ్యర్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.