వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీని స్కామ్గా మార్చారు: ‘జెన్ జీ’ ఇంటరాక్షన్లో బుద్దా వెంకన్న
- విజయవాడలోని గాంధీజీ మహిళా కళాశాలలో జెన్ జీ ఇంటరాక్షన్
- వైసీపీ హయాంలో ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయన్న బుద్దా వెంకన్న
- వీటన్నింటిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని వెల్లడి
విజయవాడలోని గాంధీజీ మహిళా కళాశాలలో నిర్వహించిన ‘జెన్ జీ - ఇంటరాక్షన్’ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న పాల్గొని విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లపై విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు, సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, గ్రూప్స్ నియామకాలతో సహా ఉద్యోగాల భర్తీని ఒక స్కామ్లా మార్చేసి బ్యాక్ డోర్ పద్ధతిలో తమ అనుచరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాల వల్ల లక్షలాది మంది ప్రతిభావంతులైన నిరుద్యోగులు నష్టపోయారని, కూటమి ప్రభుత్వం వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తుందని వెల్లడించారు.
గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని, భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలకు తావులేకుండా అత్యంత పారదర్శకమైన, ఆధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన వ్యవస్థను రూపుదిద్దుతున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అభ్యర్థులకు సరిపడా సమయం కల్పిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు లోకేశ్ కృషి చేస్తున్నారని కొనియాడారు.