లాడ్జిలో ఐడీ కార్డు ట్యాగ్‌తో భార్యను చంపిన భర్త

లాడ్జిలో ఐడీ కార్డు ట్యాగ్‌తో భార్యను చంపిన భర్త

Anand kills wife Vidya in Doddaballapura lodge
  • ఐడీ కార్డు ట్యాగ్‌తో గొంతు నులిమి దారుణానికి పాల్పడ్డ నిందితుడు
  • ఆరు నెలలుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు
  • 20 రోజుల క్రితమే ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
  • నిందితుడైన భర్త పరారీ.. పోలీసుల గాలింపు
బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో భర్తే తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్‌తో గొంతు నులిమి ప్రాణాలు తీసి, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గౌరిబిదనూరు తాలూకా నాగేరెగెరె గ్రామానికి చెందిన విద్యా (23) మృతురాలిగా గుర్తించారు. ఆమె భర్త ఆనంద్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరు దొడ్డబళ్లాపురంలోని గాంధీనగర్‌లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య తరుచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. మనస్పర్థల కారణంగా విద్యా రెండు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి బెంగళూరులోని ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నివసిస్తోంది. ఇదిలా ఉండగా, తన భార్య కనిపించడం లేదంటూ ఆనంద్ దొడ్డబళ్లాపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సుమారు 20 రోజుల క్రితం పోలీసులు విద్య ఆచూకీ కనుగొని, దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి ఆనంద్‌తో పంపించారు.

అయితే, బుధవారం ఆనంద్ విద్యను దొడ్డబళ్లాపురంలోని ఒక లాడ్జికి తీసుకువచ్చాడు. అక్కడ ఆమెను దారుణంగా హత్య చేసి, ఆమె మొబైల్ ఫోన్‌తో పరారయ్యాడు. ఈ ఘటనపై దొడ్డబళ్లాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆనంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాతే హత్యకు గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Advertisement
Anand
Vidya murder case
Doddaballapura crime
Husband kills wife in lodge
Karnataka police investigation

More Telugu News