భారతి రెడ్డిపై పోస్ట్ పెడితే మా కార్యకర్తనే జైలుకు పంపా: మంత్రి నారా లోకేశ్

భారతి రెడ్డిపై పోస్ట్ పెడితే మా కార్యకర్తనే జైలుకు పంపా: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh warns rivals against insulting women in Andhra politics
  • మహిళల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని సహించబోమన్న లోకేశ్
  • భారతి రెడ్డిపై పోస్ట్ పెట్టిన టీడీపీ కార్యకర్తను జైలుకు పంపించానని వెల్లడి
  • డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన లోకేశ్
  • గత ప్రభుత్వంలో పెట్టిన దొంగ కేసులన్నీ ఎత్తివేస్తామని కార్యకర్తలకు భరోసా
  • కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేశ్
రాజకీయాల్లో మహిళల వ్యక్తిగత ప్రతిష్ఠను కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఆ బాధ ఎలా ఉంటుందో తాను ప్రత్యక్షంగా చూశానని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఒక మహిళగా తన తల్లి భువనేశ్వరి అసెంబ్లీలో అవమానానికి గురైనప్పుడు ఎంతటి వేదన అనుభవించారో తనకు తెలుసని, అలాంటి పరిస్థితి మరే మహిళకూ రాకూడదనేదే తన లక్ష్యమని అన్నారు. వైఎస్ భారతి రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు సొంత పార్టీ కార్యకర్తనే జైలుకు పంపించానని లోకేశ్ వెల్లడించారు. రాజకీయాలు, కుటుంబాలు వేరని, తమ పార్టీ మహిళల జోలికి వస్తే మాత్రం దబిడి దిబిడేనని ప్రత్యర్థి పార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు.

బుధవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్, 'కార్యకర్తే అధినేత' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై, వైసీపీ అధినేత నేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఒకడు బుల్లెట్ దిగిందా అంటాడు. గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు, ఏమైంది ఆ సన్యాసం? చంద్రబాబు జోలికి ఎవరు వచ్చినా మాడి మసైపోతారు. దేవుడు ఎవర్నీ వదిలిపెట్టడు," అంటూ పరోక్షంగా స్థానిక నేతలపై విమర్శలు గుప్పించారు.

జగన్‌కు డీఎస్సీపై చర్చకు సవాల్

గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం డ్రామా కంపెనీ నడిపిందని లోకేశ్ ధ్వజమెత్తారు. "కోడికత్తి, గులకరాయి వంటి డ్రామాలను ప్రజలెవరూ మర్చిపోలేదు. ఒక ముఖ్యమంత్రికి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా వాళ్ల దృష్టిలో డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ కావచ్చు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయని వాళ్లు, మేము అధికారంలోకి రాగానే 16,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తే విమర్శిస్తున్నారు. దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చెయ్," అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. సొంత బాబాయి హత్య కేసులో ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని, నాడు 'నారాసుర రక్త చరిత్ర' అంటూ తమపై బురద చల్లారని మండిపడ్డారు.

మాజీ మంత్రుల అవినీతిని ఎండగట్టిన లోకేశ్

గత ప్రభుత్వంలోని మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని లోకేశ్ ఆరోపించారు. మాజీ మంత్రి శిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక యాదవుడిని చంపి పారిపోతే, ఆ కేసులో మరొకరిని ఇరికించాలని చూశారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని జగన్ పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మరో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం కుంభకోణంలో రూ.400 కోట్లు సంపాదించి, ఆ డబ్బును కోడలి ఖాతాలో వేశారని, ఇప్పుడు ఆమెను కేసులో ఇరికించారని ఆరోపించారు. బీసీ నేతలైన అమర్‌నాథ్ గౌడ్, నందం సుబ్బయ్యలను వైసీపీ నేతలే పొట్టనపెట్టుకున్నారని, ఇప్పుడు కులం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

దొంగ కేసులన్నీ ఎత్తివేస్తాం: కార్యకర్తలకు భరోసా

2019 నుంచి 2024 మధ్య టీడీపీ కార్యకర్తలపై గత ప్రభుత్వం బనాయించిన దొంగ కేసులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఎత్తివేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎంపీ బైరెడ్డి శబరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కేసులు ఉన్న కార్యకర్తలు వెంటనే పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మీరు ఇంట్లో పడుకుంటే, మీ కేసుల సంగతి మాకు ఎలా తెలుస్తుంది? మీపై ఉన్న కేసుల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి అని స్పష్టం చేశారు.

 అదేవిధంగా, 2014-19 మధ్య టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి ఆగిపోయిన బిల్లులను కూడా 99 శాతం క్లియర్ చేశామని, మిగిలినవి ఉంటే తెలియజేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కాకుండా ఇప్పుడే ఈ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

కోవూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని లోకేశ్ అన్నారు. నియోజకవర్గంలో ఎనిమిది సార్లు గెలిచినా అన్నగారి విగ్రహం లేని లోటును వేమిరెడ్డి దంపతులు తీర్చారని అభినందించారు. కార్యకర్తే పార్టీకి అధినేత అని, వారి త్యాగాల వల్లే పార్టీ నిలబడి ఉందని కొనియాడారు. 'మై టీడీపీ' యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
YS Bharathi Reddy
Jagan Mohan Reddy
Mega DSC
TDP Karyakarthe Adhinetha
Andhra Pradesh Politics

More Telugu News