అధికార లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు.. కూటమి ప్రభుత్వం నిర్ణయం
- గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన ఆళ్ల నాని
- విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు
- రేపు ఏలూరులో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని నిన్న విశాఖలో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు ఈ రాత్రికి స్వదేశానికి చేరుకోనుండటంతో, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు ఏలూరు నగరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, పోలీసులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల నాని, ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, 2024 ఎన్నికల అనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు.