వచ్చే ఏడాదే బుల్లెట్‌ రైలు పరుగులు.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

వచ్చే ఏడాదే బుల్లెట్‌ రైలు పరుగులు.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

Bullet train to run next year Railway Minister key announcement
  • వచ్చే ఏడాది మే, జూన్‌లో బుల్లెట్‌ రైలు ట్రయల్స్‌
  • 2 నుంచి 4 నెలల తర్వాత అధికారికంగా ప్రారంభం
  • తొలి బాడీ ఫ్రేమ్‌ ఇప్పటికే సిద్ధమైందన్న అశ్వినీ వైష్ణవ్‌
  • సూరత్‌-వాపి మార్గం డిసెంబరులో పూర్తయ్యే అవకాశం
  • గంటన్నరలో ముంబై నుంచి వడోదరకు
భారత్‌ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్‌ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో ఈ రైలు ట్రయల్‌ రన్స్‌ ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పరీక్షలు పూర్తైన రెండు నుంచి నాలుగు నెలల్లో వాణిజ్య సేవలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్‌ వికసిత్‌ భారత్‌’ కార్యక్రమంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. దేశీయంగా తయారవుతున్న హైస్పీడ్‌ రైలు తొలి బాడీ ఫ్రేమ్‌ ఇటీవలే పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం దానిపై స్క్వీజ్‌ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

‘‘వచ్చే ఏడాది మే లేదా జూన్‌ నాటికి మన సొంత బుల్లెట్‌ రైలు ట్రయల్స్‌ కోసం పట్టాలపైకి వస్తుంది. రెండు నుంచి నాలుగు నెలల పరీక్షల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు’’ అని వైష్ణవ్‌ చెప్పారు.

ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సూరత్‌-వాపి మార్గం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే వడోదర నుంచి ముంబైకి ప్రయాణ సమయం కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని చెప్పారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైల్వే రంగంలో ఆపరేటింగ్‌, రిజర్వేషన్‌ వ్యవస్థలతో పాటు నిర్మాణ విధానాలను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా 280 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసినట్లు వైష్ణవ్‌ తెలిపారు. కొత్తగా 36 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు వేశామని చెప్పారు. వందే భారత్‌ సాంకేతికతతో కార్గో రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

చినాబ్‌ వంతెన, మిజోరాంను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రాజెక్టు వంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యాయని తెలిపారు. కొవిడ్‌ సవాళ్లు ఉన్నప్పటికీ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి వేగం పెరిగిందన్నారు.
Advertisement
Ashwini Vaishnaw
Indian Bullet Train
Mumbai Ahmedabad Bullet Train
High Speed Rail India
Indian Railways Infrastructure
Vande Bharat Cargo

More Telugu News