నా వడోదరా అద్భుతం.. ప్రధాని మోదీ భావోద్వేగం

నా వడోదరా అద్భుతం.. ప్రధాని మోదీ భావోద్వేగం

PM Modi emotional over wonderful Vadodara cleanliness drive
  • వడోదరా ప్రజలు చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంపై ప్ర‌ధాని ప్రశంస‌లు
  • స్వచ్ఛతను పండగల స్ఫూర్తితో కొనసాగించాలని ప్రజలకు పిలుపు
  • వడోదరాను మళ్లీ అపరిశుభ్రం కానివ్వబోమని సంకల్పం తీసుకోవాలన్న మోదీ
  • పర్యటనలో భాగంగా రూ.35,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
  • మోదీ కార్యక్రమానికి బుక్‌మైషో ద్వారా రిజిస్ట్రేషన్లు.. గంటలోనే సీట్లు ఫుల్
గుజరాత్‌లోని వడోదరా నగరవాసులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తన పర్యటనకు స్వాగతంగా ప్రజలందరూ ఏకమై నగరాన్ని శుభ్రం చేయడానికి చేపట్టిన 'స్వచ్ఛతతో స్వాగతం' కార్యక్రమాన్ని చూసి తన హృదయం గర్వంతో ఉప్పొంగిపోయిందని ఆయన అన్నారు. నేడు మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీలో జరిగిన 'నమో 4 వికసిత్ భారత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. "నిన్న నేను ఒక వీడియో చూశాను. నా వడోదరాను చూసి నా ఛాతీ గర్వంతో ఉప్పొంగిపోయింది. అద్భుతం!" అంటూ నగర ప్రజల భాగస్వామ్యాన్ని కొనియాడారు. తన పర్యటనకు ముందు నగరం మొత్తం ఒక ప్రజా ఉద్యమంలా మారి శుభ్రత కార్యక్రమాలు చేపట్టడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వడోదరాలోని ప్రతి కుటుంబంలో స్వచ్ఛతపై సరికొత్త వాతావరణాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.

ఈ స్వచ్ఛతా స్ఫూర్తిని రాబోయే పండుగలైన గణేశ్ చతుర్థి, నవరాత్రి, దీపావళి వరకు కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "ఈసారి గణపతి వచ్చినప్పుడు, ఆయన ఆశీస్సులన్నీ వడోదరాపైనే కురుస్తాయని నేను భావిస్తున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిశుభ్రతా కార్యక్రమాన్ని కేవలం తాత్కాలికంగా కాకుండా, శాశ్వత పౌర నిబద్ధతగా మార్చుకోవాలని సూచించారు. 

"ఇప్పుడు మనం ఒక సంకల్పం తీసుకుందాం. వడోదరాను మళ్లీ అపరిశుభ్రంగా మారకుండా చూసుకుందాం" అని గుజరాతీలో ప్రజలను కోరారు.

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యూడీఎఫ్‌సీ), కొత్త రైల్వే సేవలు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, నీటి సరఫరా వంటివి ఉన్నాయి.

వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, పౌరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, ఎన్జీవోలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, మోదీ కార్యక్రమానికి 'బుక్‌మైషో' ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్లు నిర్వహించగా, గంటలోనే అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోవడం, మరో 42,000 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం.
Advertisement
Narendra Modi
Vadodara Gujarat
Swachhata Se Swagat
Namo 4 Viksit Bharat
Bhupendra Patel
Gujarat Development Projects

More Telugu News