మేం సిద్ధం.. స్థానిక పోరు నుంచి చంద్రబాబులా పారిపోం: గుడివాడ అమర్నాథ్
- స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న గుడివాడ అమర్నాథ్
- ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి పార్టీలు వణుకుతున్నాయని ఎద్దేవా
- ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు దిగజారుడు యత్నాలు చేస్తున్నారని విమర్శ
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ కచ్చితంగా పోటీ చేసి తీరుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. తమ అధినేత జగన్ ఎప్పుడూ ఎన్నికల బరి నుంచి తప్పించుకునే నాయకుడు కాదని అన్నారు. వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు చంద్రబాబు భయపడి పారిపోయారని ఎద్దేవా చేసిన ఆయన, ప్రజాస్వామ్యంలో గెలుపోటములను ప్రజల తీర్పు ద్వారానే తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. స్థానిక పోరును ఎదుర్కొనేందుకు తమ పార్టీ అన్ని విధాలా సమరసన్నాహాలతో సిద్ధంగా ఉందని వెల్లడించారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఒక్కటైనప్పటికీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వణుకుతున్నాయని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అధికార బలాన్ని ఉపయోగించి స్థానిక సమరాన్ని వాయిదా వేసేందుకు, ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు కూటమి నేతలు దిగజారుడు యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల విఫలంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, ఈ స్థానిక ఎన్నికల ఫలితాలతో తమ అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే కూటమి నాయకులు జంకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.