గోదారమ్మకు సాష్టాంగ ప్రణామం.. కాలువలో నిల్చొని చంద్రబాబు జలహారతి.. ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu performs Jala Harathi and prostrates to Godavari waters photos here
  • పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • కాలువలోకి దిగి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు, జలహారతి
  • నాలుగు జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు
  • గోదావరి జలాలకు అడుగడుగునా నీరాజనాలు పలికిన ఉత్తరాంధ్ర ప్రజలు
  • జలాలను ఉత్తరాంధ్రకు తెచ్చిన చంద్రబాబుకు రైతుల కృతజ్ఞతలు
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల పుష్కర, ఏలేరు, పంపా, తాండవ, వరహా, మామిడిగెడ్డ ఆయకట్టు కింద ఉన్న మొత్తం 46,620 ఎకరాలు స్థిరీకరణ కానున్నాయి.

గోదావరి జలాలు తమ ప్రాంతానికి రావడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందోత్సాహాలతో పులకించిపోయారు. కాలువకు ఇరువైపులా నిల్చుని ప్రవాహానికి అడుగడుగునా పుష్పాంజలి ఘటిస్తూ, హారతులు పడుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు. తమ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతు సోదరులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ స్వయంగా పిలిచి శిలాఫలకం వద్ద గ్రూప్ ఫోటోలు దిగారు.
Advertisement
Chandrababu Naidu
Polavaram Left Canal
Godavari Waters North Andhra
Jala Harathi Payakaraopeta
Andhra Pradesh Irrigation
Godavari River Puja

More Telugu News