‘సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు’.. కుమార్తె వివాదంపై కొండా మురళి

Konda Murali distances himself from daughter Sushmita comments against CM Revanth Reddy
  • కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్న కొండా మురళి
  • తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఆమెకు మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని వ్యాఖ్య
  • గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడి
  • 100 శాతం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టీకరణ
  • ఓ బిల్లు విషయంలోనే డిప్యూటీ సీఎం భట్టిని కలిసినట్లు వివరణ
తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొండా మురళి నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తన కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సుస్మిత వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. తాము 100 శాతం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ అధిష్ఠానం, గాంధీ కుటుంబంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు.

భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. “మా బిడ్డ వ్యాఖ్యలతో మాకు ఏం సంబంధం? మా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు” అని అన్నారు. సుస్మిత తనకు తగ్గట్టుగా తాను ఉంటుందని, ఆమె చేసిన వ్యాఖ్యలపై తాము బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో సుస్మిత వ్యాఖ్యలపై తాను భట్టి విక్రమార్కతో చర్చించలేదని మురళి తెలిపారు. ఓ బిల్లు విషయంలో ఆయన్ను కలిసినట్లు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.

కాంగ్రెస్‌ పార్టీని వీడే ఆలోచన తమకు లేదని కొండా మురళి స్పష్టం చేశారు. 100 శాతం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని, గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నుంచి కవిత బయటకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

ఈ వివాదానికి పరకాల అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ అంశం కేంద్రంగా మారింది. ఇటీవల పరకాలలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. దీనిపై సుస్మిత తీవ్రంగా స్పందించారు. పరకాల టికెట్‌ను రేవూరికి ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించడంతోపాటు, టికెట్లను అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పే సీఎం.. పరకాల విషయంలో తానే నిర్ణయం ఎలా చెబుతారని నిలదీశారు. 

సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన విమర్శలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. 

కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు సంబంధం లేదని పేర్కొంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దీనిపై సమగ్రంగా విచారించిన క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు నివేదిక సమర్పింది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి తెలిపారు.
Advertisement
Konda Murali
Konda Sushmita
Konda Surekha
Revanth Reddy
Telangana Congress
Parkal Assembly Ticket

More Telugu News