పోలవరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత
- రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు
- పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ వద్ద 30.30 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటిమట్టం
- 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
గత రెండు, మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాలలో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. ప్రాజెక్టు పరిధిలోని ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్ వే వద్ద నీటిమట్టం 30.20 మీటర్లుగా నమోదైంది. వరద నీటిని క్రమబద్ధీకరించేందుకు అధికారులు స్పిల్ వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి, దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి వరద ప్రభావంతో దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, చుట్టుపక్కల ఉన్న దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పి.గొందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.