భయంకర కరవు పరిస్థితులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు: జగన్
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరినా సమాధానం లేదన్న జగన్
- 28 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదయిందని ఆందోళన
- చంద్రబాబు మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తమ పార్టీ విసిరిన సవాలుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవైపు వర్షాలు లేక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుంటే, నీటి విడుదల విషయంలో చంద్రబాబు ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో ఉన్న నీటిని కరవుతో అల్లాడుతున్న రైతులకు అందించాల్సింది పోయి... తెలంగాణతో పోటీపడి విద్యుత్ ఉత్పత్తి కోసమే వినియోగించడం దారుణమన్నారు. అవకాశమున్నా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేయడానికి చంద్రబాబుకు మనసు ఒప్పలేదని విమర్శించారు. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో రాయలసీమకు నీరు ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు.