ఏపీలో సుజ్లాన్ భారీ విస్తరణ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

Suzlon Massive Expansion in Andhra Pradesh with 10000 Crore Investment
  • రాయదుర్గంలో సుజ్లాన్ కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్‌కు రేపు శ్రీకారం
  • రూ.10 వేల కోట్లతో 1325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుల ఏర్పాటు
  • కొత్త ప్రాజెక్టుల ద్వారా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు
  • 2030 నాటికి ఏపీలో 5 వేల మెగావాట్ల ప్రాజెక్టుల స్థాపన లక్ష్యం
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రూ.10,000 కోట్ల పెట్టుబడితో కొత్త విండ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్‌ను రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రారంభించనున్నారు.

రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్లు మండలం హులికెర గ్రామంలో ఈ కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సుజ్లాన్ చేపట్టనున్న 1325 మెగావాట్ల సామర్థ్యం గల ఈ విండ్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుంది. రేపు (ఆగస్టు 25) మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ఈ బ్లేడ్ ఉత్పత్తి లైన్ అధికారికంగా ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సుజ్లాన్ సంస్థకు ఇప్పటికే బలమైన పునాదులు ఉన్నాయి. 2004లో రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ, ప్రస్తుతం 1700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ భాగస్వామిగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలోనే ఇప్పటివరకు రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి, 2,200 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉరవకొండ నియోజకవర్గంలోని ఇప్పూరులో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది.

భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా, 2030 నాటికి రాష్ట్రంలో అదనంగా 5,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించాలని సుజ్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఉరవకొండ, విజయవాడలలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా 12,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. వీరిలో 25 శాతం మహిళలు ఉండటం గమనార్హం.

దేశీయ పవన విద్యుత్ మార్కెట్‌లో సుజ్లాన్ దాదాపు 33 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలో స్థాపితమైన ప్రతి మూడు విండ్ టర్బైన్లలో ఒకటి సుజ్లాన్ తయారీ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 20 గిగావాట్ల పవన విద్యుత్ స్థాపన మైలురాయిని దాటిన తొలి భారతీయ కంపెనీగా కూడా సుజ్లాన్ రికార్డు సృష్టించింది. ఈ తాజా ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ పవన విద్యుత్ రంగంలో సుజ్లాన్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోనుంది.
Advertisement
Suzlon
Nara Lokesh
Andhra Pradesh
Anantapur
Wind Energy
Renewable Energy Investment

More Telugu News