సచిన్ కంటే కోహ్లీనే శక్తివంతమైన ప్లేయర్: డివిలియర్స్
- ఆసియా బ్యాటర్ల శక్తిని ప్రపంచానికి సచిన్ చాటి చెప్పాడన్న డివిలియర్స్
- సచిన్ వేసిన పునాదిని అందుకున్న కోహ్లీ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంస
- సచిన్, కోహ్లీ నిర్మించిన బాటలో యువ ఆటగాళ్లు నడుస్తున్నారని వ్యాఖ్య
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశీ మైదానాల్లో, ముఖ్యంగా కఠినమైన టెస్టు పరిస్థితుల్లో భారత్ ఆధిపత్యం చెలాయించడంలో విరాట్ కోహ్లీ పాత్రే అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. విదేశీ గడ్డపై జరిగిన టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా విరాట్ కోహ్లీనే మరింత మెరుగైన, శక్తివంతమైన బ్యాటర్గా నిలిచాడని ప్రశంసించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్... ఆసియా వెలుపల స్వింగ్, తీవ్రమైన బౌన్స్ ఉండే పిచ్లపై ఆసియా బ్యాటర్లు కూడా శతకాలు బాది రాణించగలరని ప్రపంచానికి మొదటగా చూపించింది సచిన్ టెండూల్కర్ అని కొనియాడాడు. అయితే సచిన్ వేసిన ఆ బలమైన పునాదిని అందుకుని, విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన స్థాయిని మరో రేంజ్కు తీసుకెళ్లి ఆధిపత్యం చలాయించేలా చేసింది మాత్రం కోహ్లీనే అని తేల్చి చెప్పాడు.
సచిన్, విరాట్ వంటి దిగ్గజాలు నిర్మించిన ఈ బాటలోనే నేటి తరం యువ ఆటగాళ్లు నడుస్తున్నారని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ వంటి అత్యుత్తమ సాంకేతికత కలిగిన బ్యాటర్లు విదేశాల్లో సాధించే సెంచరీలను కేవలం వంద పరుగులకే పరిమితం చేయకుండా 180 ప్లస్ భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు.