భారత్ నా రెండో ఇల్లు: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్

India is my second home says former Australian cricketer Shane Watson
  • భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించిన షేన్ వాట్సన్
  • ఆస్ట్రేలియా కంటే ఇండియాలోనే ఎక్కువ ప్రేమ, మద్దతు పొందానన్న షేన్ వాట్సన్
  • సిడ్నీలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వ్యాఖ్యలు
  • ఐపీఎల్ తన కెరీర్‌కు కీలక సమయంలో అద్భుతమైన వేదికనిచ్చిందని వెల్లడి
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించాడు. సొంత దేశం ఆస్ట్రేలియా కంటే భారత్‌లోనే తనకు అత్యధిక ప్రేమాభిమానాలు, మద్దతు లభించాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలోని భారత కాన్సులేట్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వాట్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే వారు సంఖ్య ఆస్ట్రేలియా కంటే ఎంతో అధికమని షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. "భారత్‌లో నన్ను ఎవరూ పెద్దగా విమర్శించలేదని భావిస్తున్నాను. అక్కడ నాకు ఎప్పుడూ లభించే మద్దతు మరువలేనిది. ఆస్ట్రేలియాలో రాణించినప్పుడు ప్రశంసలు దక్కేవి, కానీ విఫలమైనప్పుడు విమర్శలు తప్పేవి కావు" అని వివరించాడు. భారత్‌తో పాటు ఇక్కడి ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై భారత్ చెరగని ముద్ర వేసిందని కొనియాడాడు.

తాను 19 ఏళ్ల ప్రాయంలో తొలిసారి భారత్‌ను సందర్శించానని, అప్పటి నుంచి ఈ దేశం సాధిస్తున్న అద్భుత ప్రగతిని నిశితంగా గమనిస్తున్నానని వాట్సన్ గుర్తు చేసుకున్నాడు. తనకు భారతీయ శాఖాహార వంటకాలంటే ఎంతో మక్కువని కూడా వెల్లడించాడు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), తన కెరీర్‌ కీలక దశలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన వేదికను కల్పించిందని కృతజ్ఞత చాటుకున్నాడు. కాగా, వాట్సన్ ఐపీఎల్‌లో 2008 నుంచి 2020 వరకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
Advertisement
Shane Watson
India Second Home
Australian Cricketer
IPL Career
Chennai Super Kings
Sydney Indian Consulate

More Telugu News