గ్రూప్-1పై విచారణకు మేము రెడీ.. డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?: చంద్రబాబుకు జగన్ సవాల్

YS Jagan Mohan Reddy challenges Chandrababu Naidu for CBI probe into DSC scam
  • లోకేశ్‌ను కాపాడేందుకే గ్రూప్-1పై తప్పుడు ప్రచారమన్న జగన్
  • గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ప్రిలిమ్స్ టీడీపీ హయాంలోనే జరిగాయని వెల్లడి
  • హైకోర్టు ఆదేశాలతోనే మాన్యువల్ మూల్యాంకనం చేశామని స్పష్టీకరణ
  • హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగలేదని, సిట్ దర్యాప్తుపై విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాల నుంచి కుమారుడు నారా లోకేశ్‌ను కాపాడుకునేందుకే, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. గ్రూప్-1 వ్యవహారంపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. డీఎస్సీపై దర్యాప్తు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి వివ‌రించారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వమే హడావిడిగా ఈ నోటిఫికేషన్ ఇచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మే 26న ప్రిలిమ్స్ పరీక్ష కూడా పూర్తయిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించి, 2020 డిసెంబర్‌లో మెయిన్స్ నిర్వహించామని తెలిపారు. టీడీపీ హయాంలోనే జరిగిన పరీక్షలో ఎంపికైన వారికి ఇప్పుడు రాజకీయ రంగు పులమడం దారుణమని అన్నారు.

కోవిడ్ కారణంగా మూల్యాంకనం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ మూల్యాంకనానికి నిర్ణయం తీసుకుందని, అయితే దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారని జగన్ వివరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొననందున, హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ మూల్యాంకనాన్ని పూర్తిగా పక్కనపెట్టి, మాన్యువల్ పద్ధతిలోనే జవాబు పత్రాలను దిద్దామని స్పష్టం చేశారు. ఆ మార్కుల ఆధారంగానే 163 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని, ఈ ప్రక్రియ మొత్తం హైకోర్టు పర్యవేక్షణలోనే జరిగిందని తెలిపారు. ఇప్పుడు సంబంధం లేని డిజిటల్ మూల్యాంకనంపై ఆరోపణలు చేయడం కేవలం ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనని విమర్శించారు.

గ్రూప్-1 మూల్యాంకనం హాయ్‌ల్యాండ్‌లో జరిగిందంటూ చేస్తున్న ప్రచారాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. అక్కడ ఎలాంటి మూల్యాంకనం జరగలేదని, ఈ విషయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ కూడా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని గుర్తుచేశారు. తమపై బురద జల్లేందుకు దర్యాప్తు బృందాలను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిపై విషం కక్కుతూ, వారి భవిష్యత్తును నాశనం చేయాలని చూడటం సరికాదని జగన్ హితవు పలికారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా చివరకు నిజమే గెలుస్తుందని ఆయన అన్నారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
APPSC Group 1 Inquiry
DSC Scam CBI Probe
Andhra Pradesh Politics
Nara Lokesh

More Telugu News