ఇరాన్ పోరులో అమెరికా బలగాల్లో మనోధైర్య సమస్య?.. స్పందించిన రక్షణ మంత్రి
- హోర్ముజ్ పై నియంత్రణ సాధించామన్న ట్రంప్
- అమెరికా బలగాల్లో మనోధైర్యం క్షీణిస్తోందంటూ కథనాలు
- ఆ కథనాల్లో నిజం లేదన్న అమెరికా రక్షణ కార్యదర్శి
ఇరాన్తో సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, హర్మూజ్ జలసంధిపై అమెరికా నియంత్రణ సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా దళాలలో మనోధైర్యం క్షీణిస్తోందన్న కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనాలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తీవ్రంగా ఖండించారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'లో పరిస్థితులు క్షీణించాయంటూ వస్తున్న కథనాలు పూర్తిగా వాస్తవ దూరమని ఆయన స్పష్టం చేశారు.
అయితే, మధ్యప్రాచ్యంలో ఇరాన్పై సుదీర్ఘంగా సాగుతున్న వైమానిక, నావికా దాడులు, కఠినమైన వాతావరణ పరిస్థితుల వల్ల అమెరికా వైమానిక, నావికా బలగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వర్గాలు వెల్లడించాయి. హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించామని ట్రంప్ పేర్కొనగా... అమెరికా విధించిన ఆంక్షలు, దిగ్బంధనాన్ని అధిగమించేందుకు ఇరాన్ భద్రతా సవాళ్లను విసురుతూనే ఉంది. ఈ తరుణంలో మిలిటరీ దళాల్లో సరైన వసతులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడికి సంబంధించి వస్తున్న వార్తలను అమెరికా రక్షణ శాఖ 'అతిశయోక్తి'గా అభివర్ణించింది.