నేను దేనికీ భయపడను: మహారాష్ట్రలో దాడిపై సుఖ్బీర్ సింగ్ బాదల్ తొలి ప్రకటన
- నాందేడ్లోని గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్ జీని నిన్న సందర్శించుకున్న బాదల్
- అదే సమయంలో బాదల్పై దాడి చేసిన జస్పాల్ సింగ్
- దాడిలో బాదల్ చేతికి గాయం
మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన దాడి ఘటనలో గాయపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన తొలి ప్రకటన విడుదల చేశారు. తాను దేనికీ భయపడేది లేదని, ఎల్లప్పుడూ ‘చార్దీకళా’ (ఉన్నతమైన, ఉత్సాహభరితమైన మనోధైర్యం)తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
నాందేడ్లోని ముగట్ వద్ద ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్ జీని తన కుటుంబంతో కలిసి దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో జస్పాల్ సింగ్ అనే వ్యక్తి కృపాణం (చిన్నకత్తి)తో హఠాత్తుగా బాదల్పై దాడికి యత్నించాడు. అయితే ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అడ్డుపడటంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. ఈ క్రమంలో ఆయనను కాపాడిన సబ్ ఇన్స్పెక్టర్ కూడా గాయపడ్డారు.
దాడి చేసిన నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోగా, అతడు పుణేకు చెందిన వ్యక్తిగా, గత రెండేళ్లుగా ఆ గురుద్వారాలో సేవకుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలు ఫోన్లో మాట్లాడి బాదల్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ దాడిపై ఏటీఎస్, ఐబీ ఉన్నత స్థాయి విచారణ చేపట్టాయి.