రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ఘటన.. మారనున్న సెక్షన్లు!

Rajahmundry medical student incident sections to be changed
  • వైద్య విద్యార్థిని ప్రియాంకపై దాడి ఘటనలో తండ్రి ఫిర్యాదు
  • ఇది ప్రమాదం కాదు హత్యాయత్నమేనని తీవ్ర ఆరోపణ
  • కేసులో సెక్షన్లు మార్చే అంశంపై పోలీసుల పరిశీలన
  • సికింద్రాబాద్ కిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రియాంక
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైద్య విద్యార్థిని ప్రియాంకపై మద్యం మత్తులో యువకులు కారుతో దాడి చేసిన ఘటన కీలక మలుపు తీసుకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాయత్నమని ఆరోపిస్తూ బాధితురాలి తండ్రి వెంకటేశ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలో ప్రియాంక స్కూటీని నిందితులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్ ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత వేగంగా కారు నడుపుతూ తమ కుమార్తె స్కూటీని ఒకసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఢీకొట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చాలా తేలికైనవని, నిందితులకు కఠిన శిక్ష పడేలా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

వెంకటేశ్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్ హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితురాలి తండ్రితో మాట్లాడారు. కేసు తీవ్రత దృష్ట్యా నమోదు చేసిన సెక్షన్లను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. 
Advertisement
Priyanka
Rajahmundry medical student case
Suravarapu Daswanth
Andrew Joseph Edwards
Drunk driving accident Rajahmundry
KIMS Hospital Secunderabad

More Telugu News