పోలీసు అధికారిని చంపి, సంకెళ్లతో పరార్.. 28 ఏళ్ల తర్వాత చిక్కిన కిరాతకుడు!

Rajender Bairagi arrested after 28 years for killing police officer and escaping custody
  • 28 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు రాజేందర్ బైరాగి అరెస్ట్
  • హరియాణా పోలీస్ అధికారి హత్య, కస్టడీ నుంచి పరారీ కేసుల్లో ప్రధాన నిందితుడు
  • మధ్యప్రదేశ్‌లో పేరు మార్చుకుని 'డాక్టర్ ఝట్కా'గా కొత్త జీవితం
  • డిజిటల్ ఆధారాలతో నిందితుడిని గుర్తించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
  • నకిలీ గుర్తింపు కార్డులతో టీచర్‌గా, ప్రాపర్టీ డీలర్‌గానూ అవతారం 
పోలీసు అధికారి హత్య, హత్యాయత్నం, పోలీసు కస్టడీ నుంచి సంకెళ్లతో పరారీ వంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడై, దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుడి కథకు ఎట్టకేలకు తెరపడింది. రాజేందర్ బైరాగి అలియాస్ రాజేందర్ సింగ్ యాదవ్ అలియాస్ 'డాక్టర్ ఝట్కా' (53)ను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విభాగం శనివారం రాత్రి మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసింది. 28 ఏళ్ల సుదీర్ఘ వేట అనంతరం నిందితుడిని అశోక్‌నగర్ జిల్లా ముంగావలిలో పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు.

1997లో ఢిల్లీలోని జనక్‌పురిలో జరిగిన కత్తుల దాడి, హత్యాయత్నం కేసులో రాజేందర్ బైరాగి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో 2008లో రోహిణి కోర్టు అతడిని 'ప్రొక్లెయిమ్డ్ అఫెండర్'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం, టెక్నికల్ సర్వైలెన్స్, డిజిటల్ ఫుట్‌ప్రింట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో నిందితుడు మధ్యప్రదేశ్‌లోని ముంగావలిలో పేరు మార్చుకుని నివసిస్తున్నట్లు కీలక సమాచారం లభించింది. దీంతో డీసీపీ చందర్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి, ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.

పోలీస్ అధికారి హత్య, సంకెళ్లతో పరారీ
విచారణలో రాజేందర్ నేర చరిత్ర పోలీసులను ఆశ్చర్యపరిచింది. 1998 మే 10న హరియాణాలోని సోనిపట్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో తన ముఠాతో కలిసి వివాదం సృష్టించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పెళ్లికూతురు బంధువు, హరియాణా పోలీస్ అధికారి అయిన జై భగవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన రాజేందర్, 1999 ఫిబ్రవరి 14న ఘాజియాబాద్ జైలు నుంచి సోనిపట్ కోర్టుకు తరలిస్తుండగా.. చేతులకు సంకెళ్లు ఉన్నప్పటికీ యూపీ పోలీసుల కస్టడీ నుంచి చాకచక్యంగా తప్పించుకు పారిపోయాడు.

టీచర్‌గా, డాక్టర్‌గా కొత్త జీవితం
పోలీసుల నుంచి తప్పించుకున్నాక రాజేందర్ తన గుర్తింపును పూర్తిగా మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. మొదట మహారాష్ట్రలోని కొలాబాలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఏడాదిపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని ముంగావలికి మకాం మార్చి, తన పేరును రాజేందర్ సింగ్ యాదవ్‌గా మార్చుకున్నాడు. 2003లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న మహిళను వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో స్థిరపడ్డాడు. వైద్య విద్యార్హత లేకపోయినా, ఒక క్లినిక్ నడుపుతూ స్థానికంగా 'డాక్టర్ ఝట్కా'గా పేరు సంపాదించాడు. అంతేకాకుండా, ప్రాపర్టీ డీలర్‌గా కూడా స్థిరపడి.. నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా పొందాడు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడిపై ఉన్న ఇతర కేసుల వివరాల కోసం విచారణ కొనసాగుతోందని డీసీపీ చందర్ కుమార్ సింగ్ తెలిపారు.
Advertisement
Rajender Bairagi
Delhi Police Crime Branch
Doctor Jhatka arrest
Haryana Police officer murder
Most wanted criminal arrested
Madhya Pradesh Mungaoli news

More Telugu News