ఏపీ-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 4 ఒప్పందాల డీటెయిల్స్ ఇవిగో!

Andhra Pradesh and Australia sign four strategic MoUs for development
  • ఏపీ, ఆస్ట్రేలియా మధ్య 4 కీలక ఒప్పందాలు
  • ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
  • విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఫలితంగా కుదిరిన ఎంవోయూలు
  • లోకేష్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో సంతకాలు
ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య బంధం మరింత బలపడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటూ ఇరుపక్షాలు నాలుగు వ్యూహాత్మక ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. ఉండవల్లిలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి సహాయ మంత్రి జూలియన్ హిల్ హాజరయ్యారు. ఇటీవల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన సందర్భంగా అక్కడి సంస్థలతో జరిపిన చర్చలు, ఏపీలో పెట్టుబడులకు ఇచ్చిన ఆహ్వానం ఫలితంగానే ఈ ఒప్పందాలు సాకారమయ్యాయి.

1. ఐఐటీ తిరుపతిలో సోలార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 
మొదటి ఒప్పందం ప్రకారం, విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) కలిసి ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో ‘సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా ఏపీని సోలార్ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం. ఈ సెంటర్‌లో అధునాతన సోలార్ పీవీ తయారీ, ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతాయి. సోలార్ సెల్ ఫిజిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, వాఫరింగ్ టెక్నాలజీస్ వంటి అంశాలపై కరిక్యులమ్, శిక్షణా కార్యక్రమాలను UNSW రూపొందించి సహకారం అందిస్తుంది.

2. సమ్మిళిత విద్య బలోపేతం కోసం 
రెండో ఒప్పందం సమ్మిళిత విద్యపై దృష్టి సారించింది. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. స్పెషల్ ఎడ్యుకేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, రాష్ట్ర విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనా వనరులను రూపొందిస్తారు.

3. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై పైలట్ ప్రాజెక్ట్ 
మూడో ఒప్పందంలో భాగంగా ఏపీ ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి రాష్ట్రంలోని ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణే దీని లక్ష్యం. ప్రత్యేకంగా రూపొందించిన వేదిక ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సలహాలు, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పొందవచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టును ఉచితంగా అమలు చేయనున్నారు.

4. నైపుణ్యాభివృద్ధికి డీఎల్ఎస్‌తో భాగస్వామ్యం 
నాలుగో ఒప్పందం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ (DLS) మధ్య కుదిరింది. వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించి, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అందించడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ ఒప్పందాలకు ముందు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ డా.సత్యనారాయణ్, చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Andhra Pradesh
Australia
Nara Lokesh
Solar Energy
Skill Development
Inclusive Education

More Telugu News