ఏపీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. మంత్రి లోకేశ్ చొరవతో 4 ఎంఓయూలు

Nara Lokesh initiates four MoUs with Australia for Andhra Pradesh development
  • ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు కీలక రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందాలు
  • గతంలో మంత్రి లోకేశ్ పర్యటనకు కొనసాగింపుగా కుదిరిన ఎంఓయూలు
  • ఏపీలో సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
  • ఆటిజం విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
  • యువతకు ప్రపంచస్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇరుప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే లక్ష్యంగా నాలుగు కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. గతేడాది తాను ఆస్ట్రేలియాలో జరిపిన పర్యటన సందర్భంగా జరిగిన చర్చలకు ఇది కార్యాచరణ రూపమని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుదిరాయి. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, అత్యాధునిక తయారీ, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ఈ భాగస్వామ్యం కీలకం కానుంది. ప్రతిభ, ఆవిష్కరణ, ఉమ్మడి శ్రేయస్సు పునాదులపై ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా బృందం సీఎం చంద్రబాబుతోనూ సమావేశమైంది.


సౌరశక్తి హబ్‌గా ఆంధ్రప్రదేశ్
పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆవిష్కరణల హబ్‌గా మార్చే దిశగా తొలి అడుగు పడింది. ఐఐటీ తిరుపతి, ఏపీ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), సిడ్నీకి చెందిన యూఎన్ఎస్ డబ్ల్యూ యూనివర్సిటీ సంయుక్తంగా ఏపీలో "సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అత్యాధునిక సోలార్ పీవీ తయారీ, రీసైక్లింగ్, పరిశ్రమ ఆధారిత పరిశోధన, ఫ్యాకల్టీ అభివృద్ధి, ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణపై దృష్టి సారిస్తారు.

విద్య, మానసిక ఆరోగ్యానికి పెద్దపీట
"ప్రతి చిన్నారి నేర్చుకోవడానికి, ఎదగడానికి, రాణించడానికి అర్హులు" అనే ఉద్దేశంతో ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ అభ్యసన అవసరాలున్న విద్యార్థులకు సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఒప్పందం కుదిరింది. యూఎన్ఎస్ డబ్ల్యూ సిడ్నీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రత్యేక ఉపాధ్యాయులకు, సాధారణ టీచర్లకు ఆధునిక శిక్షణ అందించి, ఏపీ విద్యార్థుల అవసరాలకు తగిన వనరులను అభివృద్ధి చేస్తారు.

అలాగే, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ, రౌండ్ డింపుల్ సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గోప్యంగా వెల్‌నెస్ అసెస్‌మెంట్‌లు, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పొందవచ్చు.

ప్రపంచస్థాయి ఉద్యోగాలకు యువత తయారీ
రాష్ట్ర యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా వృత్తి విద్య, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, వృత్తిపరమైన ధ్రువపత్రాలు, అంతర్జాతీయ ఉపాధి మార్గాలను బలోపేతం చేస్తారు. ఈ చర్యల ద్వారా నేటి ఉద్యోగాలకే కాకుండా, రేపటి కెరీర్‌లకు సైతం ఏపీ యువతను సిద్ధం చేస్తున్నామని లోకేశ్ వివరించారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Australia MoUs
Solar Manufacturing Hub
APSSDC Skill Development
Inclusive Education
Julian Hill

More Telugu News