వికసిత భారత్ కోసం డ్రగ్స్‌కు దూరం.. యువతకు ప్రధాని మోదీ పిలుపు

PM Modi calls youth to stay away from drugs for Viksit Bharat
  • వికసిత భారత్ సంకల్ప అభియాన్‌లో భాగంగా 'నశా ముక్త్ యువ' ప్రారంభం
  • మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ యువతకు ప్రధాని మోదీ పిలుపు
  • 2047 నాటికి వికసిత భారత్ సాధనకు ఆరోగ్యవంతమైన యువత అవసరమని స్పష్టీక‌ర‌ణ‌
  • దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం క్రీడలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ
  • గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైనట్లు వెల్లడించిన ప్రధాని
దేశ యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా, శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే 'వికసిత భారత్' సంకల్పం నెరవేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో నేటి తరం యువత చూపిస్తున్న నిబద్ధత, సామాజిక స్పృహ తన నమ్మకాన్ని మరింత బలపరిచాయని ఆయన ప్రశంసించారు. నేడు 'నశా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా యువతను ఏకతాటిపైకి తెచ్చి, మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 'మై భారత్' వాలంటీర్ల నేతృత్వంలో ఇది ఒక ప్రజా భాగస్వామ్య (జన్ భాగీదారీ) ఉద్యమంగా రూపుదిద్దుకుంది. "మనం ఒక గొప్ప, ముఖ్యమైన సంకల్పం కోసం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమం కేవలం ఒక వ్యక్తి, కుటుంబం లేదా సమాజం కోసం కాదు. ఇది దేశం కోసం. వికసిత భారత్ దిశగా దేశం అడుగులు వేస్తున్నప్పుడు, యువత డ్రగ్స్ సమస్యకు దూరంగా ఉండటం అత్యవసరం" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాశీతో ఈ కార్యక్రమానికి ఉన్న అనుబంధాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. "కాశీ ఎంపీగా, ఈ కార్యక్రమం గతేడాది పవిత్ర కాశీ క్షేత్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. దీనివల్ల ఈ కార్యక్రమానికి శాస్త్రీయ దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, సాధువుల ఆశీస్సులు, సాంస్కృతిక వారసత్వం కూడా తోడయ్యాయి" అని ఆయన అన్నారు. 2025 జులైలో వారణాసిలో జరిగిన యూత్ స్పిరిచ్యువల్ సమ్మిట్‌లో దేశంలోని 125 ఆధ్యాత్మిక సంస్థలు ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌తో 'కాశీ డిక్లరేషన్'‌ను ఆమోదించాయని, వారంతా లక్షలాది పౌరులకు సేవ చేస్తున్నారని మోదీ వివరించారు.

యువతను దేశానికి 'అమృత తరం' (అమృత్ పీఢి)గా అభివర్ణించిన ప్రధాని.. "రాబోయే 20-25 ఏళ్లలో మీ జీవితాలకు మీరే దిశానిర్దేశం చేసుకుంటారు. 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసేది మీరే. ఆ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేది కూడా మీరే. దేశానికి మీ శక్తి, సృజనాత్మకత, ప్రతిభ ఎంతో అవసరం. కాబట్టి దేశం కోసం, మీ సొంత జీవితాల కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండండి" అని పిలుపునిచ్చారు.

ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు, వాకథాన్‌లు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే యువతే వికసిత భారత్‌కు అసలైన బలం' అనే సందేశాన్ని దేశంలోని ప్రతి యువకుడికి చేర్చడమే ఈ ఉద్యమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Advertisement
PM Modi
Drug Free India
Nasha Mukt Bharat Abhiyan
Viksit Bharat 2047
Kashi Varanasi
Indian Youth

More Telugu News