తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు!

Tirumala pilgrim rush continues 24 hours for Srivari Sarva Darshan
  • తిరుమల కొండపై భక్తజన సంద్రం
  • కిలోమీటర్ల మేర క్యూలైన్లు
  • నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు, శిలాతోరణం దాటిన క్యూలైన్లు
  • శుక్రవారం రూ. 3.66 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి, క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ఈ రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం (జులై 17) ఒక్కరోజే 74,096 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 36,562 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లుగా నమోదైంది. భక్తుల కోసం 4 లక్షల లడ్డూలను విక్రయించగా, 2.98 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. సుమారు 3,890 మందికి వైద్య సేవలు అవసరమయ్యాయి.

భారీ రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది. భక్తులు ఓపికతో వ్యవహరించి, సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Advertisement
Tirumala
TTD
Tirupati Balaji Darshan
Sarva Darshan waiting time
Vaikuntam Queue Complex
Tirumala pilgrim rush

More Telugu News