‘బాధపడడం ఎందుకు?’.. రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రచారంపై కపిల్‌ దేవ్‌

Rohit Sharma retirement rumors Kapil Dev says why be sad
  • రోహిత్‌ రిటైర్మెంట్‌పై జోరు ప్రచారం
  • దీనిపై స్పందించిన కపిల్‌ దేవ్‌
  • ఏదో ఒకరోజు వీడ్కోలు చెప్పక తప్పదని వ్యాఖ్య
  • ఇన్నేళ్లు రోహిత్‌ ఎంతో ఆనందం పంచాడని వెల్లడి
  • అతడి రిటైర్మెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవాలని సూచన
  • బాధపడాల్సిన అవసరం లేదని హితవు
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ ప్రచారంపై మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ స్పందించాడు. రోహిత్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికే రోజు ఎప్పుడొచ్చినా అది బాధపడాల్సిన సందర్భం కాదని, సంబరాలు చేసుకోవాల్సిన క్షణమని అభిప్రాయపడ్డాడు. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డే రోహిత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించాడు.

‘‘బాధ ఎందుకు? ఇన్నేళ్లుగా రోహిత్ మనందరికీ ఎంతో ఆనందం పంచాడు. ఏదో ఒకరోజు అందరూ క్రికెట్‌ను వీడాల్సిందే. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ ఇలా అందరూ వీడారు. అలాగే రోహిత్ కూడా ఒకరోజు తప్పకుండా వీడ్కోలు చెబుతాడు’’ అని కపిల్ దేవ్ అన్నాడు.

రోహిత్ వెళ్లే రోజు అతడి కెరీర్‌ను గర్వంగా గుర్తుచేసుకోవాలని కపిల్ సూచించాడు. ‘‘దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు అతడు ఎన్నో అద్భుతమైన క్షణాలు అందించాడు. అలాంటి ఆటగాడి ప్రయాణాన్ని బాధగా కాకుండా సెలబ్రేట్ చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు.

అంతేకాదు, రోహిత్ రిటైర్ అయితే సెంచరీతో చిరస్మరణీయంగా వీడ్కోలు పలకాలని ఆకాంక్షించాడు. ‘‘ఏదో ఒకరోజు వెళ్లాల్సిందే. కానీ వెళ్లే ముందు శతకం బాది వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని చెప్పాడు.

2007లో ఐర్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా 11, 26 పరుగులకే పరిమితమవడంతో రిటైర్మెంట్ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఎనిమిది వన్డేల్లో 241 పరుగులు చేసిన రోహిత్ సగటు 30.12గా ఉంది. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేపై అందరి దృష్టి నెలకొంది.
Advertisement
Rohit Sharma
Kapil Dev
Rohit Sharma retirement
India vs England ODI
Team India
Lords Cricket Ground

More Telugu News