2027 నాటికి పోలవరం పూర్తి: గుడివాడ సభలో చంద్రబాబు కీలక ప్రకటన
- నేడు గుడివాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు
- పట్టిసీమను 12 నెలల రికార్డు కాలంలో పూర్తి చేశామన్న సీఎం
- తల్లికి వందనం పిల్లలందరికీ వర్తింప చేస్తామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి వంద శాతం పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన, అక్కడ జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' బహిరంగ సభలో మాట్లాడుతూ పోలవరం నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం అత్యంత శరవేగంగా ముందుకు తీసుకెళుతోందని ప్రకటించారు. గతంలో తాము కేవలం 12 నెలల రికార్డు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారా ఏపీలో కరవు అనే మాటే లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై స్పందిస్తూ.. ఈ నెల నుంచే రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. కృష్ణా జిల్లాకు ఎంతో ఘనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉందని కొనియాడిన ముఖ్యమంత్రి, అభివృద్ధిలోనూ ఈ ప్రాంతాన్ని ముందంజలో ఉంచుతామన్నారు. కేవలం ప్రాజెక్టులే కాకుండా నగరాలు, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు 'చెత్త నుంచి సంపద సృష్టి' చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.