భారత్‌ చుట్టూ విదేశీ నిఘా?.. వరుస ఘటనల వెనుక ఏం జరుగుతోంది?

Reports on presence of foreign operatives in and around India raises serious concern
  • భారత్‌ చుట్టూ విదేశీ పౌరుల వరుస ఘటనలు
  • అమెరికన్‌, ఉక్రెయిన్‌ పౌరుల కేసులతో చర్చ
  • నేపాల్‌ సరిహద్దులో అమెరికా పౌరుడు అరెస్టు
  • మయన్మార్‌ కేసులో కొనసాగుతున్న ఎన్‌ఐఏ దర్యాప్తు
  • బంగ్లాదేశ్‌లో అమెరికా అధికారి మృతిపై అనుమానాలు
భారత్‌తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస ఘటనలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తుల అరెస్టులు, బంగ్లాదేశ్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి అనుమానాస్పద మృతి వంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదు.

నేపాల్‌ సరిహద్దులో అమెరికా పౌరుడు
ఈ నెల ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలి సరిహద్దు వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా నేపాల్‌లోకి వెళ్లేందుకు యత్నించిన అమెరికా పౌరుడు జోర్డాన్‌ బ్రౌన్‌ను సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) అదుపులోకి తీసుకుంది. తాను గతంలో అమెరికా నేవీ, స్పెషల్‌ ఫోర్సెస్‌లో పనిచేశానని అతడు చెబుతున్నాడు. కానీ, దానికి సంబంధించిన ఆధారాలు చూపలేకపోయాడు. అతడి నుంచి నగదు, మొబైల్‌ ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వాన్‌డైక్‌ కేసు మరో చర్చ
ఈ ఏడాది మార్చిలో అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్‌ వాన్‌డైక్‌తో పాటు ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. వీరు భారత్‌ను మధ్యేమార్గంగా ఉపయోగించుకుంటూ మయన్మార్‌లోని స్థానిక సాయుధ వర్గాలకు డ్రోన్లు, సైనిక శిక్షణ అందించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న పరికరాల్లో డ్రోన్‌ శిక్షణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లభించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

బంగ్లాదేశ్‌లో అమెరికా అధికారి మృతి
గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అమెరికా ఆర్మీ ఫస్ట్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌ కమాండ్‌కు చెందిన అధికారి టెరెన్స్‌ ఆర్వెల్‌ జాక్సన్‌ మృతి చెందారు. తొలుత సహజ మరణంగా అధికారులు పేర్కొన్నారు.  కానీ కొన్ని మీడియా కథనాలు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

హమాస్‌పై వ్యాఖ్యలతో మరోసారి చర్చ
ఇటీవల భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో హమాస్‌కు అనుబంధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రాంతీయ భద్రతపై చర్చను మరింత వేడెక్కించాయి. అయితే దీనిపై సంబంధిత దేశాల నుంచి అధికారిక స్పందన రాలేదు.

నిపుణుల హెచ్చరిక ఇదే
ఈ ఘటనలు పరస్పరం సంబంధం ఉన్నాయని చెప్పేందుకు ప్రస్తుతం అధికారిక ఆధారాలు లేవు. కానీ, ఇలాంటి పరిణామాలు సరిహద్దు భద్రత, నిఘా వ్యవస్థలు, దేశాల మధ్య ఇంటెలిజెన్స్‌ సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇలాంటి ఘటనలపై పారదర్శక దర్యాప్తు జరగడం కూడా కీలకమని సూచిస్తున్నారు.
Advertisement
Foreign operatives
Matthew Aaron VanDyke
Terrence Arvelle Jackson
India
USA
Nepal

More Telugu News