ఊరూరా తిరిగి బీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు తెలియజేస్తాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar says we will expose BRS conspiracies to the people across villages
  • కాళేశ్వరం కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమన్న పొన్నం ప్రభాకర్
  • మేడిగడ్డ, కన్నెపల్లి విషయంలో రాజకీయం చేస్తున్నారని విమర్శ
  • ఎల్‌నినోను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరపున సూచనలు చేస్తున్నామని వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టు సంక్షోభం, రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సమస్యలపై బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న బీఆర్ఎస్ శ్రేణులు రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని, దీనికి బీఆర్‌ఎస్ కారణమని ఆరోపించారు. ప్రతి గ్రామానికి వెళ్లి బీఆర్‌ఎస్ చేసిన కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. 

ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక ఇచ్చి కాళేశ్వరంలో నీటిని నింపమని చెబితే వెంటనే నింపుతామని చెప్పారు. ఇంజనీర్ల సలహాలను పాటిస్తామని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కరవును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే మేడిగడ్డ, కన్నెపల్లి విషయంలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

ఈ ఏడాది వర్షాలు తక్కువ పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరపున సూచనలు చేస్తున్నామని తెలిపారు. కరవును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలుగా అంతర్గత సమస్యలు ఉన్నా కలిసి ఎదుర్కోవాలని, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సలహాలు ఇవ్వాలని కోరారు.
Advertisement
Ponnam Prabhakar
BRS Party
Kaleshwaram Project
Medigadda Barrage
Telangana Irrigation Crisis
NDSA Report

More Telugu News