అసలు సమస్యే రాకుండా చూసేవాడు అద్భుతమైన అధికారి: సీఎం చంద్రబాబు

 Chandrababu review meeting with ministers and officials
  • మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం
  • సమస్య రాకముందే పసిగట్టాలి.. అదే సమర్థత అన్న చంద్రబాబు
  • అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లాలి.. నాలుగు గోడలకే పరిమితం కావొద్దని సూచన
  • ఇకపై నెలవారీ ఆర్థిక నివేదికల (MER) ఆధారంగా సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ
"సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించేవాడు మంచి అధికారి అయితే, అసలు సమస్యే తలెత్తకుండా ముందుచూపుతో పనిచేసేవాడు అద్భుతమైన అధికారి. ఆ కోణంలో అధికారులు పనిచేయాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు నాలుగు గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని, వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లగలమని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు.

డేటా ఆధారిత పాలన.. నెలవారీ నివేదికలతో సమీక్ష

డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ ఫలితాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్ - MER) ద్వారా రాష్ట్ర ప్రగతిని సమీక్షించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. "ఇకపై ప్రతీ నెలా ఆర్థిక నివేదికలు విడుదల చేస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వ శాఖల పనితీరు, రెవెన్యూ రాబడులు, అధికారుల నైపుణ్యాలను అంచనా వేసుకుని ముందుకు వెళ్తాం. ప్రతీ నెలా కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సమావేశమై పురోగతిని సమీక్షించుకుందాం," అని తెలిపారు.

గత ఐదేళ్ల (2019-24) పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని, విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. "గత రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం సమిష్టిగా పనిచేసి, క్షేత్రస్థాయిలో కొంతవరకు మార్పు తేగలిగాం. గత పాలనలో పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం పోయింది. మేం వచ్చాక పరిస్థితి మార్చి, దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించాం. ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం" అని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 'స్వర్ణాంధ్ర-2047' విజన్‌ను రూపొందించామని, తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని శాఖల పనితీరు సరిగా లేకపోవడంతో, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో భూ వివాదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ (PGRS)లో 'జీరో పెండెన్సీ' లక్ష్యంగా పెట్టుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు వంటి ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించామని, రీసర్వే ద్వారా ప్రతి నెలా 9వ తేదీన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు.

ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై స్పష్టత

రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో దృష్టి సారించిందని సీఎం తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేస్తామని, సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Governance
Monthly Economic Reports
Polavaram Project
Swarnandhra 2047 Vision
Public Grievance Redressal

More Telugu News