అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says development has nothing to do with politics
  • వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వినతి
  • 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయాలని కోరిన ముఖ్యమంత్రి
  • కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన
  • వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం
అభివృద్ధిని రాజ‌కీయాల‌తో ముడిపెట్టకూడదని, రాజ‌కీయాలు కేవలం ఎన్నిక‌ల స‌మయానికే ప‌రిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు ఇతర పరిశ్రమల రాకతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున విమానాశ్రయం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి... కేంద్రమంత్రికి వివరించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి, 2028 జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణా సంస్థలను (FTO) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని కోరగా, దీనిపై తగిన ప్రతిపాదనలు అందజేయాలని కేంద్రమంత్రి సూచించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రం చేయనంత వేగంగా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు.

వరంగల్ కీలకం

ఉత్త‌ర తెలంగాణ‌లోని ఉమ్మడి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంల‌తో పాటు న‌ల్గొండకు వరంగల్ కేంద్ర బిందువుగా ఉంటుంద‌ని ముఖ్యమంత్రి తెలిపారు. రైలు, రోడ్డు మార్గాలతో మెరుగైన అనుసంధానం ఉండటంతో పాటు కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ వంటి పరిశ్రమలతో ఈ నగరం మరింత కీల‌కంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో వ‌రంగ‌ల్‌ను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామ‌ని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధికి రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని, రాజ‌కీయాలను కేవలం ఎన్నికలకే ప‌రిమితం చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వివిధ అంశాల్లో కేంద్ర ప్ర‌భుత్వం త‌మకు సహకరిస్తోందని, ఏవైనా సమస్యలు ఉంటే కేంద్ర మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. ఏదైనా స‌మాచార లోపం ఉంటే దానిని పరస్పరం మార్చుకోవ‌డం ద్వారా అధిగ‌మిస్తున్నామ‌ని ఆయన వివరించారు.
Advertisement
Revanth Reddy
Ram Mohan Naidu
Warangal Mamnoor Airport
Adilabad Airport
Telangana Airport Development

More Telugu News