ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీమిండియా కోచ్‌ల్లో ఒకరు రాజీనామా?

Ryan ten Doeschate likely to resign as Team India coach after England ODI series
  • టెన్‌ డూస్కాటే రాజీనామాకు సిద్ధమైనట్లు కథనం
  • బీసీసీఐకి నిర్ణయం తెలిపినట్లు సమాచారం
  • ఇంగ్లండ్‌ సిరీస్‌ తర్వాత తప్పుకొనే అవకాశం
  • వ్యక్తిగత కారణాలతోనే నిర్ణయమని సమాచారం
  • కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావన
భారత క్రికెట్‌ జట్టు సహాయ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు క్రిక్‌బజ్‌ కథనం వెల్లడించింది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అంగీకరిస్తే, ఇంగ్లండ్‌తో చివరి వన్డే అతడికి భారత జట్టుతో ఆఖరు మ్యాచ్‌ కానుంది.

టెన్‌ డస్కాటే నిర్ణయానికి అసంతృప్తి కారణం కాదని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లండన్‌లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు తక్కువ ప్రయాణాలు ఉండే బాధ్యతలను స్వీకరించాలని అతడు భావిస్తున్నట్లు వెల్లడించింది.

రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్‌గా టెన్‌ డస్కాటే బాధ్యతలు చేపట్టాడు. అతడి తొలి ఒప్పందం కూడా ఇటీవలే ముగిసినట్లు సమాచారం. గౌతమ్‌ గంభీర్‌ సిఫార్సుతోనే అతడు కోచింగ్‌ బృందంలో చేరగా, రాజీనామాను ఆమోదించాలా వద్దా అనే విషయంలో గంభీర్‌కు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని కథనం పేర్కొంది. అయితే అతడి రాజీనామాను అడ్డుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలిపింది.

మరోవైపు, భారత మాజీ చీఫ్ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ల్లో గంభీర్‌కు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో లేదన్నాడు. హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా లేకపోవడం ప్రభావం చూపిందని చెప్పాడు. రెండు సిరీస్‌ల్లో ఓడిపోయినంత మాత్రాన గంభీర్‌ను విమర్శించడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించాడు.



Advertisement
Ryan ten Doeschate
Team India Assistant Coach
Gautam Gambhir
BCCI
India vs England ODI Series
Indian Cricket Team Coach Resignation

More Telugu News