కోలీవుడ్ లో దర్శకుడిగా పాండిరాజ్ కి మంచిపేరు ఉంది. వైవిధ్యభరితమైన కథలను తెరపై వినోదభరితంగా .. ఆసక్తికరంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. కామెడీ టచ్ ఇస్తూనే ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన సినిమానే  'పరిమళ అండ్ కో'.  జయరామ్ ప్రధానమైన పాత్రగా తెరకెక్కిన ఈ సినిమా, జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'జీ 5' లో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

నగరంలో పరిమళ ( జయరామ్) తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అప్పారావు (యోగిబాబు) ఇంట్లో చాలా కాలం నుంచి అద్దెకి ఉంటాడు. ఆయన భార్య స్వరాజ్యం (ఊర్వశి) కూతుళ్లు పరాశక్తి (సంజనా కృష్ణమూర్తి) మధుమిత (అనంతిక). పరిమళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చాలా పొదుపుగా నెట్టుకొస్తుంటాడు. అయితే ఆ సిటీలో వర్గీస్ (శాండీ) అనే జులాయి తిరుగుతూ ఉంటాడు. అతను నగరంలోని కాలేజ్ కుర్రాళ్లకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుంటాడు. అతని వెనక రాజకీయనాయకులు ఉండటంతో పోలీసులు వెనకడుగు వేస్తుంటారు.  

 'జాలరిపేట'కి చెందిన వర్గీస్, హత్యలు చేయడానికి కూడా ఎంతమాత్రం వెనుకాడడు. అందువలన అతనంటే అక్కడి వాళ్లంతా భయపడుతుంటారు. ప్రేమిస్తున్నానంటూ అతను మధుమిత వెంటపడుతూ ఉంటాడు. పరిమళతో పాటు అతని పెద్ద కూతురు .. చిన్నకూతురు ఎంతగా మందలించినా అతను వినిపించుకోడు. వర్గీస్ తల్లి సురేఖావాణి కూడా  ఆ ఏరియాలో తన దందా కొనసాగిస్తూ ఉంటుంది. మధుమిత విషయంలో ఆమె కొడుకును మరింత సపోర్ట్ చేస్తుంది. 

దాంతో వర్గీస్ చనిపోతేనే తాము ప్రశాంతంగా బ్రతకగలమని పరిమళ భావిస్తాడు. మిగతా కుటుంబ సభ్యులంతా అతని నిర్ణయానికి తమ మద్దతును తెలియజేస్తారు. చిట్టీ ( సంతోష్ శోభన్)అనే యుకుడిని పరాశక్తి ప్రేమిస్తూ ఉంటుంది. వర్గీస్ విషయంలో తమ ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఆమె చిట్టీతో చెబుతుంది. ఆ మరుసటి రోజునే వర్గీస్ దారుణంగా హత్య చేయబడతాడు. ఈ వార్త బయటికి రాగానే, సిటీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.

వర్గీస్ చనిపోవడానికి ముందు అతనికి పరిమళ ఫ్యామిలీతో గొడవ జరిగిందని తెలుసుకున్న సురేఖావాణి, తన అనుచరులతో బయల్దేరుతుంది. వర్గీస్ తో పరిమళకు గల గొడవను గురించి తెలుసుకున్న పోలీస్ టీమ్ కూడా పరిమళ ఇంటికి బయల్దేరుతుంది. తన ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పరిమళ ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వర్గీస్ ను హత్య చేసింది ఎవరు? అనేది మిగతా కథ.

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక  రౌడీ హత్య కేసులో చిక్కుకుంటుంది. ఆ ఫ్యామిలీ కోసం ఒక వైపున పోలీస్ ఆఫీసర్ ఏడుకొండలు గాలిస్తుంటే, మరో వైపున ఆ రౌడీ తాలూకు గ్యాంగ్  వెంటాడుతూ ఉంటుంది. వాళ్ల బారి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకో గలుగుతుందా? ప్రాణాలతో బయటపడగలుగుతుందా? వర్గీస్ హత్య వెనకున్న సూత్రధారులు ఎవరు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

మధ్యతరగతి కుటుంబీకులు పరువుకు ప్రాణం ఇస్తుంటారు. డబ్బు .. అధికారం .. రాజకీయనాయకుల అండదండలు ఉన్నవారు, మిడిల్ క్లాస్ అమ్మాయిలను టార్గెట్ చేస్తుంటారు. అలాంటివారైతే పరువుకు భయపడి బయటికి రారనీ, తమని ఏమీ చేయలేరనే ఒక ధైర్యంతో ఉంటారు. అయితే అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కాపాడుకోవడానికి తండ్రి అనేవాడు ఎంతకైనా తెగిస్తాడనే విషయాన్ని చాటి చెప్పిన సినిమానే 'దృశ్యం'. 

అలాంటి ఒక సినిమాను పోలినదిగా 'పరిమళ అండ్ కో' కనిపిస్తుంది. అయితే కంటెంట్ పరంగా ఇది 'దృశ్యం' సినిమాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. 'దృశ్యం' సినిమా సీరియస్ గా కొనసాగితే, ఈ సినిమా  మాత్రం కామెడీ టచ్ ఇస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ ను కనెక్ట్ చేస్తుంది. హంతకుడు ఎవరనేది చివరివరకూ ఆడియన్స్ కనుక్కోలేని విధంగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఒక రౌడీ హత్య .. ఆ విషయంలో అనుమానితులుగా నిలిచిన ఒక ఫ్యామిలీ, ఆవేశంతో వాళ్లను వెంటాడే హతుడి తాలూకు అనుచరులు .. అసలేం జరిగిందనేది తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ టీమ్. ఇలా ఈ మూడు వైపుల నుంచి కథను .. పాత్రలను నడిపించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా సహజంగా తమ పాత్రలను పండించారు .. సన్నివేశాలను రక్తికట్టించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 

ఈ సినిమాలో బరువైన పాత్రలు గానీ, బలమైన సన్నివేశాలు గానీ లేవు. సరదాగా నవ్విస్తూనే, నెక్స్ట్ ఏం జరగనుందా? అనే ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు ఈ కథకి మరింత బలాన్ని చేకూర్చుతాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమానే ఇది.